సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్, మిత్రపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మతం ఆధారంగానే పాకిస్తాన్ ఏర్పడిందనే విషయం విపక్షాలు మర్చిపోతున్నాయని అన్నారు. రెండు రోజుల పర్యటన కోసం కర్నాటకు వచ్చిన ప్రధాని మోదీ.. తొలి రోజు తుముకూరులోని శ్రీ సిద్ధగంగ మఠాన్ని సందర్శించారు. శ్రీసిద్ధగంగ మఠం నుంచి 2020 సంవత్సరాన్ని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నాను అని మోదీ తెలిపారు.
శ్రీసిద్ధగంగ మఠం యొక్క పవిత్ర శక్తి దేశ ప్రజల జీవితాలను సుసంపన్నం చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 21వ శతాబ్దంలోని మూడో దశకంలోకి భారతదేశం నూతన శక్తితో ప్రవేశించిందన్నారు. కొత్త సంత్సరం అంచనాలు, ఆకాంక్షలు బలమైన పునాదులతో ప్రారంభమైందని మోదీ స్పష్టం చేశారు.