రాజధాని అమరావతి లోనే కొనసాగించాలని కోరుతూ ప్రతిభ హై స్కూల్ విద్యార్థినీవిద్యార్థులు పోస్టుకార్డు ఉద్యమం ప్రారంభించారు. గత 16 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా గురువారం మండల కేంద్రమైన తాడేపల్లి నుంచి రాష్ట్రపతి కి పోస్టుకార్డు లేఖలు రాశారు.
ఈ సందర్భంగా అమరావతి పరిరక్షణ కమిటీ సభ్యులు పాతర్ల రమేష్, నూతక్కి ఏడుకొండలు మాట్లాడుతూ అమరావతి నే రాజధాని గా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని వారు కోరారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు. రైతాంగాన్ని కాపాడాలని వారు రాష్ట్రపతి ని కోరారు.
రాజధాని నిర్మాణానికి ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపన చేశారని ఇప్పుడు దాన్ని మార్చడం మంచిది కాదని వారన్నారు. రాజధాని ఇక్కడే కొనసాగించాలని సెవ్ ఆంధ్రప్రదేశ్, సెవ్ రాజధాని అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిసి నాయకుడు చాగంటిపాటి పూర్ణచంద్రరావు, ఉపాధ్యాయులు కాజా లక్ష్మీప్రసాద్, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.