పోలీసుల దాడిలో గాయపడిన అమరావతి మహిళా రైతులను నేడు కృష్ణా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గద్దె అనురాధ పరామర్శించారు.
ఎస్ సి రైతులను పోలీసులు అరెస్టు చేసి చేతులకు, కాళ్లకు సంకెళ్లు వేసి జైలుకు తీసుకువెళ్లినందుకు నిరసనగా నిన్న అమరావతి దళిత జేఏసీ ఛలో గుంటూరు కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ పిలుపునకు స్పందించి అమరావతి రైతులు గుంటూరు నుంచి విజయవాడ నుంచి రైతులను బంధించిన జైలు వద్దకు వెళుతుండగా పోలీసులు పలు చోట్ల వారిని అడ్డుకున్నారు.
అంతే కాకుండా మహిళలను నిర్భంధించి వారిపట్ల అమానుషంగా ప్రవర్తించారు. దాంతో ఎంతో మంది మహిళలు గాయపడ్డారు.
గాయాలతో హాస్పటల్లో ఉన్న రాజధాని మహిళా రైతులను పరామర్శించిన అనూరాధ మాట్లాడుతూ పోలీసుల ప్రవర్తన సరికాదని అన్నారు.
శాంతి యుతంగా ధర్నాచేస్తున్న రైతుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం చూస్తున్నామని, శాంతియుతంగా ఛలో గుంటూరు కార్యక్రమంలో పాల్గొనే వారిని కూడా దౌర్జన్యంగా అడ్డగించారని ఆమె అన్నారు.