దిశ శేరిలింగంపల్లి ఇన్చార్జీ తుడుం భూమేష్ను కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ సిబ్బంది శనివారం ఉదయం చట్టవిరుద్ధంగా ఇంటి నుంచి తీసుకెళ్లడాన్ని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు భూమి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా భూమి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వృత్తిలో భాగంగా వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై, అక్రమ కేసులు బనాయిస్తూ భయబ్రాంతులకు గురి చేసేవిధంగా పోలీసులు వ్యవరించడం దారుణమని, దీనిని టీయూడబ్ల్యూజే ( ఐ జే యూ ) తీవ్రంగా ఖండిస్తున్నదని అన్నారు.
శేరిలింగంపల్లి ఇన్చార్జీ భూమేష్ రాయని వార్తను తనకు ఆపాదిస్తూ కుటుంబ సభ్యులకు గాని, తాను పనిచేస్తున్న సంస్థకు గాని 41(a ) సి అర్ పీ సి నోటీసులు ఇవ్వకుండా ఉదయాన్నే ఇంటి నుంచి బలవంతంగా ఎత్తుకెళ్లడం చట్టవిరుద్దమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మూడు ద్విచక్ర వాహనాలపై సివిల్ డ్రెస్లో భుమేష్ నివాసానికి చేరుకున్న ఎస్ ఐ రంజిత్ బృందం అతని ఫోన్ లాక్కొని సంఘ విద్రోహ శక్తిని తీసుకెళ్లినట్టు కేపీహెచ్బీ పోలీసు స్టేషన్కు తరలించడం చట్ట విరుద్ధమన్నారు.
వార్త ప్రచురితమైనప్పడు సదరు వార్త డేట్లైన్ను పరిశీలించ కుండా పోలీసులు కక్షపూరితంగా రాజకీయ వత్తిడులకు తల వగ్గి నచ్చని విలేకర్ల ను లక్షంగా చేసుకుని అక్రమ కేసుల్లో ఇరికించడం మంచిది కాదని హితవు పలికారు. సమగ్ర విచారణ జరుపకుండా ఏకపక్షంగా పోలీసులు ప్రవర్తించడం హేయమైన చర్య అన్నారు. విలేకర్ల పై అక్రమ కేసులు బనాయించడం మానుకోకపోతే జర్నలిస్ట్ సంఘాలు ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.