హైకోర్టు తీర్పుతో కడిగిన ముత్యంలా బయటకు వచ్చిన మంత్రి గంగుల కమలాకర్
గత ఎన్నికల్లో కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తనపై ప్రతిపక్షాలు చేసిన కుట్రలు వీగిపోయాయని, ప్రజల ఆశీర్వాదంతో నామినేషన్ వేసిన రోజే హైకోర్టు తీర్పు రావడం ఆ దేవుడు సైతం తనకు అండగా ఉన్నాడని భావిస్తున్నానని రాష్ట్ర మంత్రి కరీంనగర్ బి ఆర్ ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నికల వ్యయం పెరిగిందని పొన్నం ప్రభాకర్ వేసిన కేసును నేడు హైకోర్టు కొట్టి వేసింది, గతంలో బండి సంజయ్ వేసిన కేసులోనూ హైకోర్టు అతనికి జరిమానా విధించి మొట్టికాయలు వేసిన విషయం విదితమే.
ఈ సందర్భంగా కరీంనగర్లో నామినేషన్ వేసిన అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ న్యాయమే దిక్సూచిగా ప్రజాసేవ కోసం పనిచేస్తున్న తనను కరీంనగర్ ప్రజలు ఇప్పటికే వరుసగా ఐదుసార్లు గెలిపించారని, కౌన్సిలర్ గా, కార్పోరేటర్ గా, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం వెనక ప్రజలతో తనకున్న సాన్నిహిత్యమే కారణమన్నారు. దీన్ని సహించలేని ప్రతిపక్షాలు కుట్రలతో కేసులు వేస్తే న్యాయం తన పక్షాన ఉంది కాబట్టే వీగిపోతున్నాయి అన్నారు, ఎన్నికల వ్యయమైన, మరేదైనా న్యాయాన్ని, చట్టాల్ని అత్యంత గౌరవించే వ్యక్తిగా ఎల్లప్పుడూ పాటిస్తానన్నారు మంత్రి గంగుల. ఈ తీర్పుతోనైనా ప్రతిపక్షాలు తమ కుత్సిత బుద్ధి వీడి ప్రజాక్షేత్రంలో ప్రజల మన్నన ఉన్న తనను విమర్శించడం మానుకోవాలన్నారు.
రాబోయే ఎన్నికల్లోను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ అభివృద్ధి పథకాలే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని, కరీంనగర్ లో ప్రజా ప్రతినిధిగా గెలుపుల్లో డబల్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు మంత్రి గంగుల.