కరోనా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ అత్యవసరం లేకున్నా వాహనాలపై రోడ్డు పైకి వచ్చేవారిని జైలుకు పంపిస్తామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ హెచ్చరించారు. లాక్ డౌన్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
99% మంది లాక్డౌన్ నిబంధనలు పాటిస్తున్నారని, 1% మంది మాత్రమే వాటిని ఉల్లంఘిస్తున్నారని ఆయన తెలిపారు. అలాంటి వాళ్ళవల్ల ఇన్ని రోజుల కష్టం వృధా అవుతుందని హెచ్చరించారు. పిల్లలు బయటకు రాకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఎమర్జెన్సీ సర్వీసులు కొనసాగుతున్నాయని, ప్రజల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. పోలీసులు 24 గంటలూ కరోనా విధులు నిర్వర్తిస్తున్నారని వాళ్లకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 18 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. 3500 పిటీ కేసులు, నిబంధనలు ఉల్లంఘించిన వివిధ సంస్థలపై 182 కేసులు నమోదు చేశామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన 17 వేల మందిపై ట్రాఫిక్ విభాగం కేసులు నమోదు చేసిందని తెలిపారు. ఇప్పటి వరకు 2724 వాహనాలను సీజ్ చేశామన్నారు.