(సత్యం న్యూస్ ప్రత్యేకం)
ప్రపంచ ఆరోగ్య సంస్థ కు నిధుల నిలుపుదల నిర్ణయం తీసుకున్న అమెరికా తన తెంపరితనాన్ని మరోసారి బహిర్గతం చేసింది. యావత్ ప్రపంచం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న దుస్థితి లో ప్రపంచఆరోగ్య సంస్థ పై అర్థం లేని ఆరోపణలు చేయడం వెనుక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సొంత అజెండా క్రమంగా బయట పడుతోంది.
కోవిడ్-19 ప్రమాదాన్ని గుర్తించి, తక్షణమే ప్రపంచాన్ని జాగృత పరచాల్సిన కనీస కర్తవ్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆచరిస్తే మానవాళికి ఇంత భారీ స్థాయిలో నష్టం జరిగేది కాదని తీవ్రంగా విమర్శించింది. పైపెచ్చు కరోనా పుట్టుకకు, పలు దేశాలలో వైరస్ ప్రబలడానికి కారణమైన చైనా కి కొమ్ము కాయడం, ఆ దేశం తీసుకున్న సత్వర నిర్ణయాలవల్ల కరోనా అరికట్టినట్లు కితాబు ఇవ్వడంతో ట్రంప్ మండి పడ్డారు.
కరోనా మహమ్మారి పై సభ్య దేశాలను అప్ర్రమత్తం చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రపంచంలోని కరోనా ముప్పుకు ఆ సంస్థ పూర్తి బాధ్యత వహించాలని అమెరికా అంటోంది. నిధుల విడుదల ఆపడానికి ఇదే కారణమని తన వాదనను బలంగా వినిపిస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కు అత్యధికంగా ఆర్థిక సహకారం అందించే దేశంగా అమెరికా ను గుర్తించాలని ట్రంప్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి వాదిస్తున్నారు. విధాన నిర్ణయాలలో అమెరికా కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అంతర్జాతీయ వేదికలపై తన వాణి వినిపించారు.
యునైటెడ్ నేషన్ కు ఉన్న విలువ స్థాయిని అనేక సార్లు ప్రశ్నించి దానికి ఉన్న అంతర్జాతీయ స్థాయిపై అక్కసు ప్రదర్శించడం గమనార్హం. యునెస్కో, యుఎన్ హ్యూమనిస్ట్ కౌన్సిల్ తదితర విభాగాల పై తన కు విశ్వాసం లేనట్లు ప్రకటన చేశారు.
వాతావరణ పరిరక్షణకు సభ్యదేశాలు పాటించాల్సిన కఠిన నిర్ణయాలు, ఇరాన్ న్యూక్లియర్ డీల్, యూకే కీలక ఒప్పందం వంటి అనేక అంశాలపై అమెరికా అంతర్జాతీయ సంస్థ తో విభేదించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తన అదుపాజ్ఞలతో నడవాలని , సంస్థ నిర్వహణ కు ఎక్కువ మొత్తం నిధులిస్తు న్న కారణంగా తన మాట చెల్లాలని అమెరికా పట్టుపడుతోంది.
తాజాగా, ఏప్రిల్ 15 న ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ విడుదల చేసిన ప్రకటనలో …. 1945 నుంచి విశ్వవ్యాప్తంగా ప్రజలు చవిచూసిన అనేక సంక్రమణ వ్యాధుల మరణాల వివరాలు తెలిపారు. మలే రియా, పోలియో, ఎయిడ్స్, మశూచి, సార్స్, ఎ బోలా తదితర జబ్బులను ఎలా ఎదుర్కొన్నది వివరించారు.
ఏటా 50 కోట్ల డాలర్లు నిధులను ఉదారంగా ప్రకటించే అమెరికాను ప్రశంసించారు.. అయితే తాజాగా అమెరికా నిధులు ఇవ్వకుంటే కోవిడ్ -19 పై చేస్తున్న ఉమ్మడి పోరాటానికి కొంత మేర నష్టం వాటిల్లగలదని డై రెక్టర్ జనరల్ ఆందోళన వ్యక్తం చేశారు.
తన నిర్ణయం పట్ల అమెరికా పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. అయితే…. అమెరికా తీసుకున్న నిర్ణయం వెనుక ట్రంప్ వ్యక్తిగత ప్రయోజనం ఉన్నట్లు కనిపిస్తున్నది. కరోనా వ్యాప్తి ప్రాథమిక దశలో గుర్తించడానికి ట్రంప్ ప్రయత్నించక నిర్లక్ష్యం చేసారని, పర్యవసానం గా అమెరికాలో మరణాలు పెరుగుతున్న ట్లు సంయుక్త రాష్ట్రాల గవర్నర్ లు వ్యాఖ్యానించడం తో ఆయన తనను తాను కాపాడుకునే వ్యూహానికి రంగం సిద్ధం చేసినట్లు అర్థమవుతొంది.
స్వదేశంలో దిగ జారిన ప్రతిష్ఠ ను నిలుపుకోవడమే తక్షణ లక్ష్యంగా ప్రపంచం దృష్టిని మరల్చడానికే ఇకపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కు నిధులు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది… అంతర్జాతీయ స్థాయి ప్రపంచ మార్కెట్ లో శరవేగంగా దూసుకుపోతూ తనకు ప్రత్యక్ష పోటీ దారుగా ఎదుగుతున్న చైనా ను అరికట్టేందుకు అంది వచ్చిన అవకాశంగా అమెరికా ఎత్తుగడ వేసింది.
మరోవైపు చాలా కాలం గా ప్రపంచ ఆరోగ్య సంస్థ పై తనకు ఉన్న అసహనాన్ని ఈ విధంగా ప్రదర్శించింది. ఈ నేపధ్యంలో డబ్ల్యుహెచ్ ఓ మిగిలిన సభ్య దేశాలను నిధులకోసం అర్దించింది.. అందుకు స్పందించిన చైనా తాము ఇకపై నిధులు పెంచుతామంటూ సంకేతాలు ఇచ్చింది.
కోవిడ్ పై పోరాటం లో చురుకైన పాత్ర పోషిస్తున్న డబ్ల్యు హెచ్ ఓ కి నిధులను అమెరికా ఆ పేయడం సరైన ది కాదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరాస్ అన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఐకమత్యంగా ఉంటూ రాబోయే విపత్తును ఎదుర్కోవాల్సిన తరుణంలో అమెరికా ఇ టువంటి నిర్ణయం తీసుకోవడం సహేతుకంగా లేదని అన్నారు.
ప్రస్తుతం నెలకొన్న విపత్కర సమయంలో వివాదాలకు, అనవసర భేషజాలకు తా వివ్వక అమెరికా పెద్ద మనసు తో పునరాలోచించాలి.. కరోనా కట్టడికి ఉదారంగా నిధులిచ్చి ఆపన్నులను ఆదుకునేందుకు వెంటనే స్పదించాలని సభ్యదేశాలు కోరుకుంటున్నాయి.
కోల్పోతున్న తన పరపతికి ప్రజల ప్రాణాలు బలిచేయడం అమానుషం అనే వాస్తవాన్ని గుర్తించి ట్రంప్ ఇప్పటికైనా తన నిర్ణయం మార్చుకుంటే ప్రపంచ చరిత్రలో ఆయనకు ఏ నాటికీ సుస్థిర స్థానం వుంటుంది..కాదని మొండిగా వ్యవహరిస్తే చరిత్రహీనుడు గా మిగలడం ఖాయం…
కృష్ణారావు (ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి)