అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాజకుమారి ఆయన ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతికలగాలని మౌనం పాటించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ – భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టి, ప్రాణాలను అర్పించి, అమరజీవిగా నిలిచిన మహానీయుడు పొట్టి శ్రీరాములు అన్నారు. మహాత్ముడు బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన ఘనత శ్రీరాములదన్నారు. స్వాతంత్ర్య సంగ్రామంలో గాంధీ వెంట నడిచి, సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని, జైలుశిక్ష అనుభవించారన్నారు. కులమతాలకతీతంగా
వ్యవహరించి, హరిజనులను దేవాలయంలోకి అనుమతించాలని నిరాహార దీక్ష చేపట్టారన్నారు. శ్రీరాములు నిరాహార
దీక్షతో అప్పటి మద్రాసు ప్రభుత్వ హరిజనులను దేవాలయంలోకి అనుమతిస్తూ శాసనాలు చేసిందన్నారు. ఇక రాష్ట్ర
ప్రభుత్వం పొట్టి శ్రీరాముల త్యాగాలను గుర్తిస్తూ నెల్లూరు జిల్లాకు 2008లో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా
నామకరణం చేశారని ఎస్పీ గుర్తు చేశారు.
నివాళులర్పించిన వారిలో అడిషనల్ ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, ఎఆర్ డీఎస్పీ ఎల్.శేషాద్రి, ఎస్బీ సీఐ జి. రాంబాబు, ఆర్ఐలు నాగేశ్వరరావు, చిరంజీవరావు, టివిఆర్ కె కుమార్, ఆర్ఎస్ఏలు, ఏఆర్ సిబ్బంది, ఇతర పోలీసు, సిబ్బంది ఉన్నారు.