రైతుల దిగుబడులకు మార్కెటింగ్ ఊతమిచ్చేలా ‘కిసాన్ రైలు’ త్వరలోనే అనంత నుంచి ఢిల్లీకి వెళ్లనుంది. ఇందుకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకుంటున్నారు.
ఈనెల 9వ తేదీన అనంత నుంచి వెళ్లే రైలును జూమ్ యాప్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉద్యాన, మార్కెటింగ్ అధికారులతో ఏపీఎంఐపీ కార్యాలయంలో ఎంపీ రంగయ్య, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ వసతుల కల్పనపై చర్చించారు. కిసాన్ రైలు ద్వారా ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రధాన మార్కెట్లకు ఉద్యాన ఉత్పత్తుల తరలింపుపై సమీక్షించారు.
జిల్లాలో పంట ఉత్పత్తులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా 9వ తేదీన సీఎం జగన్ లాంఛనంగా రైలును ప్రారంభించనుండగా.. పూర్తి స్థాయిలో అక్టోబర్ నుంచి అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు, తాడిపత్రి రైల్వే స్టేషన్ల నుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి.
తొలి రోజు 500 టన్నుల అరటి, బొప్పాయి, చీనీ, దానిమ్మ, నిమ్మ, టమోటాను తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ ద్వారా 250 టన్నులు, ఉద్యాన శాఖ ద్వారా 250 టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ క్రమంలో పంట సేకరణపై రైతులు, ట్రేడర్లతో మాట్లాడాలని ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే అనంతలు అధికారులకు సూచించారు. రైతులు పండించే పంటలకు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో రవాణా చేసేందుకు కిసాన్ రైలు ఉపయోగపడుతుందన్న విషయాన్ని తెలియజేయాలని సూచించారు.
ఈనెల 5వ తేదీలోగా రైల్వేకు ఇండెంట్ ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలియజేశారు. సమీక్ష తర్వాత స్థానిక రైల్వేస్టేషన్లో వసతులను ఎంపీ, ఎమ్మెల్యే పరిశీలించారు.
టామోటా మార్కెట్కు వెళ్లి రైతులతో మాట్లాడారు. కిసాన్ రైల్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.