ఎన్నికలప్పుడే రాజకీయాలని, మిగతా సమయంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి పైనే తాము దృష్టి కేంద్రీకరిస్తున్నామని నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రానున్న ఎన్నికల లోపు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడమే లక్ష్యంగా ఉంచుకొని ముందుకెళుతున్నామని చెప్పారు.
మంగళవారం అమరావతిలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు అవసరాలను తెలియజేస్తే వాటికి అవసరమైన నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నెల్లూరు 27వ డివిజన్ డివిజన్ ఇంచార్జ్ సన్నపురెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 20 లక్షల రూపాయలతో రోడ్లకు, డ్రైన్లకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ డివిజన్లో నాలుగు కోట్ల రూపాయలతో పనులు చేపట్టామని తెలిపారు. ఇంకా కూడా ఏమైనా ఉంటే వాటిని కూడా పూర్తి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఎక్కువగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించామని తెలిపారు.
అవినీతి లేకుండా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. మన రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసేందుకు వారు యత్నిస్తున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, కార్పొరేటర్లు, వైసిపి నేతలు స్థానిక నేతలు పాల్గొన్నారు.