కాంగ్రెస్ పార్టీ అభిమానులకు శుభవార్త. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన ప్రతిపాదనను తిరస్కరించినట్లు ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్ లో ప్రకటించారు. వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ ను పార్టీలో చేర్చుకోవడానికి సీనియర్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించినట్లు సత్యంన్యూస్.నెట్ ఉదయమే ఒక వార్తను పోస్టు చేసిన విషయం తెలిసిందే.
మరీ ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ కు అంత ప్రాధాన్యతనివ్వడాన్ని రాహుల్ గాంధీ పూర్తిగా వ్యతిరేకించారు. ప్రియాంక గాంధీ మరి కొందరు మాత్రం ప్రశాంత్ కిషోర్ ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా తీసుకుని ఎన్నికల నిర్వహణ బాధ్యత అప్పగించాలని సూచించారు. అయితే ఈ నిర్ణయంపై ఎటూ తేల్చుకోలేని ఏఐసిసి తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రశాంత్ కిషోర్ చేసిన ప్రతిపాదనలపై ఎనిమిది మందితో విశ్లేషణ కమిటీని వేశారు.
ఆ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలపై మరో కమిటీ వేశారు. ఇదంతా ప్రశాంత్ కిషోర్ ను పార్టీలోకి తీసుకోవడానికి, ఎన్నికల బాధ్యతలు అప్పగించడానికి ఇష్టం లేకే చేస్తున్నారని కొందరు విశ్లేషకులు భావించారు. కాంగ్రెస్ పార్టీలో ఇంత మేధోమధనం జరుగుతున్న సమయంలోనే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ బద్ధ శత్రువు అయిన టీఆర్ఎస్ తో ఎన్నికల ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇలా చేయడంతో ప్రశాంత్ కిషోర్ క్రెడిబిలిటీని కాంగ్రెస్ పార్టీ అనుమానించింది. అనుకున్నట్లుగానే ప్రశాంత్ కిషోర్ తాను కాంగ్రెస్ పార్టీలో చేరడంలేదని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా కూడా ట్విట్టర్లో ఈ వార్తలను ధృవీకరించారు. ప్రశాంత్ కిషోర్ ప్రెజెంటేషన్, చర్చల తరువాత, కాంగ్రెస్ అధ్యక్షురాలు యాక్షన్ గ్రూప్ 2024ని ఏర్పాటు చేసారు. ఆ యాక్షన్ గ్రూప్ సిఫార్సుల మేరకు ఆయనను పార్టీలో చేరమని ఆహ్వానించారు. బాధ్యత. అయితే అతను తిరస్కరించాడు. పార్టీకి అందించిన సూచనలను అతని ప్రయత్నాలను మేము అభినందిస్తున్నాము అని ఆయన ట్విట్టర్ లో తెలిపారు.