కరోన వైరస్ నేపధ్యం లో ప్రభుత్వం ప్రతి ఇంటికి వైద్య సిబ్బందిని పంపించి ‘తెల్మో మీటర్ గన్’ తో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ మహిళా జాగృతి అధ్యక్షురాలు ఆలం పల్లి లత రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెక్కాడితే గానీ డొక్కాడని రోజువారి దినసరి కూలీల పరిస్థితి దీనంగా మారిందని కూలీలను ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని పనులు వాయిదా వేసుకొని ఇంటికే పరిమితమైన పేదలు కూలీలు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజకు ఇబ్బందులు కలగకుండా వారి వారి ఇంటి వద్దనే నిత్యావసర వస్తువులు ప్రభుత్వం అందజేయాలని కోరారు. అవసరమైతే స్వచ్చంద సంస్థల సహాయాన్ని తీసుకోవాలని ఆమె కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పిలుపు మేరకు దేశ ప్రజలు ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యు విజయవంతం చేసినందుకు దేశ ప్రజలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 31 వరకు భారత ప్రభుత్వం పిలుపునిచ్చిన లాక్ డౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కరోనా సమస్య ఏ ఒక్కరిది కాదని యావత్ భారత దేశ ప్రజల సమస్య అని పేర్కొన్నారు.