తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈనెల 21 నుంచి నౌకాదళం శక్తిసామర్థ్యాలు, ఆధునిక యుద్ధరీతుల సన్నద్ధత తెలిపేదే ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూ జరగనుంది. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరవుతారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 20నే విశాఖ వెళ్లనున్నారు. రాష్ట్రపతిని ఆహ్వానించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఈ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో భారీ స్థాయిలో నౌకాదళ, కోస్ట్ గార్డు, ఓషనోగ్రఫీ నౌకలు, సబ్ మెరైన్లు, ఎయిర్ క్రాప్టులు పాల్గొంటాయి. దేశ మెరైన్ అవసరాలకు అనుగుణంగా నౌకల నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు నౌకాదళం సన్నద్దంగా ఉండాల్సి ఉంటుంది. ఆ సన్నద్ధతను బేరీజు వేసుకునేందుకు ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ ఒక కొలమానంగా ఉంటుంది. అత్యంత చాకచక్యంగా వ్యవహరించడం, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడం.. మన సత్తా చాటి చెప్పడం.. వంటి అంశాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి.
75 ఏళ్ళ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ సారి ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూను దేశ సేవలో 75 ఏళ్లు అన్న నినాదంతో నిర్వహిస్తున్నారు. 60 నౌకలు, సబ్ మెరైన్లు, 50కి పైగా ఎయిర్ క్రాప్టులతో ముఖ్య విన్యాసాలు నిర్వహించనున్నారు. ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూలోని నౌకా విన్యాసాలను ఆర్కే బీచ్ నుంచి ప్రజలు సైతం వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.