రెండు రోజుల పర్యటన నిమిత్తం 23న ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ రాజధాని టోక్యోకు వెళ్లనున్నారు. పర్యటనకు ముందు, ఈ పర్యటన ఉద్దేశ్యాన్ని తెలుపుతూ ప్రధాని మోదీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు క్వాడ్ సమ్మిట్లో పాల్గొనేందుకు జపాన్ వెళ్తున్నట్లు తెలిపారు.
టోక్యో పర్యటన సందర్భంగా, భారతదేశం-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో చర్చలు జరుగుతాయి. జపాన్లో జరిగే రెండవ క్వాడ్ లీడర్స్ సమ్మిట్లో ప్రధాని వ్యక్తిగతంగా కూడా పాల్గొంటారు. ఇది క్వాడ్ నిర్ణయాల పురోగతిని సమీక్షించడానికి నాలుగు క్వాడ్ దేశాల నాయకులకు అవకాశాన్ని కల్పిస్తుందని ప్రధాని మోదీ భావిస్తున్నారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతం అభివృద్ధి, పరస్పర ఆసక్తి ఉన్న ప్రపంచ సమస్యలపై కూడా ఈ సమావేశాలలో అభిప్రాయాలను పంచుకుంటారు. అమెరికన్ ప్రెసిడెంట్ జో బిడెన్తో ద్వైపాక్షిక సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది. అమెరికాతో బహుముఖ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై ప్రధాని మోడీ చర్చిస్తారు.
ప్రాంతీయ అభివృద్ధి, సమకాలీన ప్రపంచ సమస్యలపై చర్చలు కొనసాగిస్తామని ప్రధాని మోదీ అన్నారు. కొత్తగా ఎన్నికైన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తొలిసారిగా క్వాడ్ లీడర్స్ సమ్మిట్కు హాజరవుతారు. ఆయనతో కూడా మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో భారతదేశం ఆస్ట్రేలియా మధ్య బహుముఖ సహకారం, పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలు చర్చిస్తారు.