అవినీతి, కుటుంబ పాలన ఎంతో కాలం ఉండదని ప్రధాని మోదీ అన్నారు. హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్టులో కార్యకర్తలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. తెలంగాణలో అవినీతి రహిత పాలన అందించేందుకు సిద్ధమన్నారు. పేదలను దోచుకునేవారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో మూఢనమ్మకాలతో ఏం జరుగుతోందో దేశ ప్రజలకు తెలియాలన్నారు. కేబినెట్లో ఎవరిని ఉంచాలో.. ఎవరిని తీసేయాలో.. మూఢనమ్మకాలు నిర్ణయిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని దుష్టశక్తులు ఏకమయ్యాయన్నారు. అవినీతిపరులంతా ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. బీజేపీ కార్యకర్తలు బూత్ స్థాయికి వెళ్లాలన్నారు.
22 ఏళ్లుగా ఎందరితోనో ఎన్నో తిట్లు తిన్నాను.. రోజు కిలోల కొద్దీ తిట్లు తింటాను.. అందుకే అలసిపోనన్నారు. మోదీని తిట్టేవాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. చక్కగా తిట్లు వింటూ.. చాయ్ తాగుతూ ఎంజాయ్ చేయాలన్నారు. తెలంగాణ సర్కార్కు రోజూ మోదీని తిట్టేందుకే సమయం సరిపోతోందన్నారు. మీరెన్ని తిట్లు తిట్టినా వాటిని అరిగించుకునే శక్తి తమలో ఉందన్నారు. తెలంగాణ సమాజాన్ని తిడితే మాత్రం అంతకంతా ప్రతీకారం తప్పదని మోదీ పేర్కొన్నారు. గతంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టేవన్నారు. కానీ ఆధార్ లింక్ చేసి అవినీతిని అడ్డుకున్నామన్నారు. రైతుల ఖాతాల్లోనే పీఎం కిసాన్ నిధులు వేస్తామన్నారు. నిధులు నేరుగా లబ్ధిదారులకే ఇస్తుండడంతో.. అవినీతిపరులకు కడుపు మండుతోందని ప్రధాని మోదీ అన్నారు.