ఈ నెల 11వ తేదీన విశాఖపట్నం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని అమరావతి పై నోరు విప్పాలని బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల భాగస్వామ్యంతో, చట్టబద్ధంగా ఏర్పడిన అమరావతిని కూకటి వేళ్లతో పెకలించేందుకు మూడు రాజధానుల పేరిట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాటకాలు ప్రదర్శిస్తున్నారని, రాజధానిని రాజకీయ లడాయిగా మార్చారని, ఫలితంగా భూములు ఇచ్చిన రైతులు న్యాయం కోసం ఉద్యమించక తప్ప లేదని చెప్పారు.
అత్యున్నత హైకోర్టు అమరావతి ఏకైక రాజధాని అంటూ తీర్పు ఇచ్చినా ప్రభుత్వం ఉత్తరాంధ్ర, రాయలసీమ గర్జన సభలు పెట్టి మూడు ప్రాంతాల్లో ప్రాంతీయ కలతలు, కలహాలకు ఆజ్యం పోసిందని ఆరోపించారు. ప్రధాని చేతుల మీదుగా జరిగిన రాజధాని శంకుస్థాపన శిలాఫలకం దృశ్యాన్ని ప్రధాని గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. రాజధాని రైతులు, జేఏసీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరాలని, రాజధాని ఉద్యమ ప్రస్థానాన్ని ప్రధానికి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నిరసన తెలపాలని పేర్కొన్నారు.కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పడిన అమరావతి రాజధాని అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా బాలకోటయ్య స్పష్టం చేశారు.