రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలోని తొట్లకొండపై సినిమా క్లబ్ కు 15 ఎకరాలు కేటాయించడంపై బుద్దిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు మాజీ బిజెపి శాసన సభ పక్ష నేత విష్ణు కుమార్ రాజుకు వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ అతి పవిత్రమైన స్థలంలో సినిమా క్లబ్ నిర్మించడం చాలా దుర్మార్గమని అన్నారు. ప్రజలు మనోభావాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని ఇది అన్యాయమని ఆయన వ్యాఖ్యానించారు.
సినిమా క్లబ్ కు స్థలం కేటాయిస్తూ ఇచ్చిన జీవో నెంబరు 21 ను రాష్ట్ర ప్రభుత్వం పునపరిశీలన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బుద్దిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ
కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ మాట్లాడుతూ పవిత్ర బౌద్ధ క్షేత్రమైన తొట్లకొండ పై 15 ఎకరాలు సినిమా క్లబ్ కు కేటాయించడం దారుణంమని అన్నారు.
తొట్లకొండ పై ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలు చేపట్టకూడదని ఇప్పటికే పలుమార్లు నిరసనలు తెలిపినా ప్రభుత్వం ముందుకు వెళ్లడం శోచనీయమని ఆయన అన్నారు.