నాగర్ కర్నూలు జిల్లాలో ఈ నెల 27 తేదీన నిర్వహించనున్న పల్స్పోలియో కార్యక్రమాన్ని సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లాను పోలియో రహిత జిల్లాగా తయారు చేసేందుకు అందరు సహకరించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో పల్స్పోలియో ఇమ్యునైజేషన్-2022 కార్యక్రమంపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పల్స్పోలియో కార్యక్రమంపై దినపత్రికలు, టి.వి.లు, కేబుల్ టి.వి. స్రోలింగ్ ఇతరత్రా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలలో వినత ప్రచారం నిర్వహించాలని, జిల్లాలో దాదాపు 91 వేల 25 మంది 0-5 సం॥ల వయస్సు గల పిల్లలు ఉన్నారని, వీరికి పోలియో చుక్కలు అందించేందుకు 721 పోలియో బూత్స్, కూడళ్ళు, రవాణా ప్రాంతాలైన 28 స్థానాలలో తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.
3008 పల్స్పోలియో వ్యాక్సిన్ను జిల్లాలో తగిన ప్రాంతంలో భద్రపర్చడం జరిగిందని, పోలియో వ్యాక్సిన్ అందించేందుకు 28 బృందాలను ఏర్పాటు చేసి 0-5 సం॥ల వయస్సు గల పిల్లలందరికీ అందించడంతో పాలు వీధి బాలలను గుర్తించి వ్యాక్సిన్ ఇవ్వాలని తెలిపారు. గ్రామాలలో ప్రజలందరికీ తెలిసేలా టామ్-టామ్ చేయించాలని, ప్రధాన కూడళ్ళు, ప్రజల రద్దీ ఎక్కువగా ఉందే ప్రాంతాలలో వద్ద పోలియో వ్యాక్సిన్ తేదీలు తెలిసే విధంగా బ్యానర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా సంబంధిత శాఖల అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు. అంగన్వాడి కార్యకర్తలు గ్రామ పరిధిలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి వెంకటలక్ష్మి, బీసీ వెల్ఫేర్ అధికారి అనిల్ ప్రకాష్, డిపిఆర్ఓ సీతారాం, డిఎస్పి మోహన్ రెడ్డి, డి.ఎస్.ఒ కృష్ణారెడ్డి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.