క్వారంటైన్ లో ఉంటున్న విద్యార్థులకు ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించడం లేదని పంజాబ్ నుంచి వచ్చిన బిటెక్ విద్యార్థులు కడప లోని కె.ఎస్.ఆర్.ఎమ్ క్వారంటైన్ సెంటర్ లో నిరసన చేశారు. ఈ నెల 12, 16 తేదీల్లో 47 మంది విద్యార్థులు పంజాబ్ నుంచి కడప జిల్లాకు వచ్చారు.
కోవిడ్ 19 రూల్స్ ప్రకారం వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో వారికి కరోనా నెగిటివ్ రావడంతో స్థానిక కె.ఎస్.ఆర్.ఎమ్ గణేష్ హాస్టల్లో 14 రోజులు కామన్ క్వారంటైన్ కు అధికారులు పంపారు. రెండు రోజుల నుంచి కనీసం మెనూ ప్రకారం కూడా ఆహారం అందించడంలో అధికారులు విఫలమైనారని విద్యార్థులు అంటున్నారు.
పంజాబ్ లో ప్రభుత్వం హోం క్వారంటైన్ కు సిఫార్సు చేస్తే ఇక్కడ ఆంధ్ర ప్రభుత్వం తమను నిర్బంధించిందని వారన్నారు. తమకు జరుగుతున్న అన్యాయం పై వారు అధికారులతో గొడవకు దిగారు. కనీసం మాకు కడుపు నిండా అన్నం పెట్టడం లేదని విద్యార్థులు వాపోయారు. కనీసం శానిటేజర్ కూడా ఇవ్వలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. దయచేసి తమను హోమ్ క్వారేటైన్ కు పంపించాలని అధికారులను వేడుకున్నారు. అంతవరకు భోజనాలను చెయ్యమని నిరసనకు దిగారు.