పివిఎన్ఆర్ డౌన్ ర్యాంప్ ను ప్రారంభించిన మంత్రి తలసాని
రాజధాని హైదరాబాద్ నగరం జనాభా పెరుగుదల, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఒనగూర్చుకుంటుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. శనివారం ఉదయం పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే పైన లక్ష్మీనగర్ వద్ద సుమారు రూ.5 కోట్ల వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) నిర్మించిన డౌన్ ర్యాంప్ ను మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, ఎం.ఎస్.ప్రభాకర్, ఎమ్మెల్యే కౌసర్ మోహిద్దీన్, డిప్యూటీ మేయర్ ఎం.శ్రీలత శోభన్రెడ్డి, గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ లతో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం నేడు దేశానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు విజన్ తో హైదరాబాద్ జంటనగరాల రూపురేఖల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.
కనెక్టివిటీ, హాస్పిటాలిటీ, లా అండ్ ఆర్డర్ అంశాల్లో హైదరాబాద్ నగరం దేశంలోని ఇతర నగరాలకు ధీటుగా ఉందన్నారు. మరో రెండు, మూడు దశాబ్దాల భవిష్యత్తును, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పరిధిలో మౌళిక వసతుల కల్పన కోసం ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతున్నారని వివరించారు.
ప్రణాళికలను రూపొందించడంలోను, రోడ్లు, ఫ్లై ఓవర్ బ్రిడ్జీలను నిర్మించి ప్రజలకుల అందుబాటులోకి తీసుకువస్తున్న హెచ్ఎండిఏ యంత్రాంగాన్ని మంత్రి శ్రీనివాసయాదవ్ అభినందించారు. కార్యక్రమంలో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(హెచ్ జిసిఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ ఐఏఎస్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డి, సెక్రెటరీ పి.చంద్రయ్య, సూపరింటెండెంటింగ్ ఇంజినీర్స్ యూసుఫ్ హుస్సేన్, శ్రీమతి పరంజ్యోతి, డౌన్ ర్యాంప్ నిర్మాణంలో భాగస్వామ్యమైన ఇంజినీర్లు రజిత, గౌతమి, విద్యాసాగర్, వెంకటేశ్, అశుతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.