ఈ నెల 27వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో పాఠశాల విద్యార్థులు, వైద్య సిబ్బంది, ఆశ వరర్లతో పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 27వ తేదీ గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటించి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో పల్స్పోలియో కార్యక్రమానికి వైద్యారోగ్యశాఖ విజయవంతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసిందన్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు చుక్కల మందు వేసేందుకు అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఏటా చుక్కల మందు కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉండగా రెండేళ్లుగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చిందన్నారు. జిల్లాలో 91,025 మంది 0-5 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నారు. వీరందరికీ 721 పోలియో కేంద్రాల ద్వారా ఈనెల 27వ తేదీన (ఆదివారం) చుక్కల మందు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇందుకోసం 2,233మంది శిక్షణ పొందిన ఆరోగ్య, అంగన్వాడీ సిబ్బందితోపాటు ఆశా కార్యకర్తలు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా 28 మొబైల్ టీంలు పని చెయన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని బస్సు స్టేషన్లు, ఇటుకబట్టీలు, భవన నిర్మాణ కార్మిక పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేశామని, చెప్పారు.
ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా చుక్కల మందు వేయించాలన్నారు. తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్ లాల్, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, డిపిఆర్ఓ సీతారాం, డాక్టర్ దశరథం, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కురుమయ్య, రెడ్ క్రాస్ కార్యదర్శి రమేష్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్