కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఏ రాష్ట్రంలో చేయని విధంగా క్వారంటైన్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుండగా ఒక్కో నియోజకవర్గంలో 100 నుంచి 150 పడకలు క్వారంటైన్ కోసం ఏర్పాటు చేసింది.
ఇప్పటికే రాష్ట్రం మొత్తమ్మీద బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఉన్నవి కాకుండా నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ పడకలు 20 వేల వరకూ అందుబాటులోకి వచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై జిల్లా కలెక్టర్లు వైద్య ఆరోగ్య శాఖకు నివేదిక ఇచ్చారు.
ప్రతి నియోజకవర్గంలోనూ ఆస్పత్రులు, స్కూళ్లు, కళాశాలలు, ఆర్టీసీ భవనాలు, డిగ్రీ కళాశాలలు ఇలా ఎక్కడ అనుకూలంగా ఉంటుందో ఆ భవనాలన్నిటినీ కరోనా వైరస్ లక్షణాలున్న వారి కోసం సిద్ధం చేశారు. ఇవి కాకుండా మరికొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో వెంటిలేటర్తో కూడిన పడకల ఏర్పాటుకు ఆదేశాలు వెళ్లాయి.
కరోనా అనుమానిత లక్షణాలుంటే వారిని తక్షణమే ఆ నియోజకవర్గాల పరిధిలో ఉన్న క్వారంటైన్కు తరలించాలని జిల్లా వైద్యాధికారులకు కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. తాజాగా 4 బోధనాస్పత్రులను కేవలం కరోనా ఆస్పత్రులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
13 జిల్లా ఆస్పత్రులు, మరో 7 బోధనాస్పత్రుల్లోనూ కరోనా వైరస్ లక్షణాలున్న వారికి వైద్యమందిస్తారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా మరికొన్ని క్వారంటైన్ కేంద్రాలు పెంచేలా సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.