రిషి కొండపై అక్రమంగా కొంప కట్టుకున్న వ్యక్తిని మంత్రులు భగవంతుడితో పోల్చడం విడ్డూరంగా ఉంది. తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీశైలం కొండపై శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాలు నిర్మించినట్లుగానే, రిషికొండపై జమోరె నిర్మించిన అక్రమ భవనాన్ని మంత్రులు పోల్చి చూపించడం చూస్తే వారికి మతి అన్నది లేకుండా పోయిందని స్పష్టమవుతుందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రిషికొండపై జగన్మోహన్ రెడ్డి తన కొత్త కాపురం కోసం భవనాన్ని నిర్మించుకుంటే, ఆ భవనాన్ని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తో, శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాలతో పోల్చిన మంత్రులు పిచ్చి ప్రేలాపనలు చూస్తుంటే ఇంతకంటే దురదృష్టకరం మరొకటి లేదన్నారు. మంత్రులు గుడివాడ అమర్నాథ్, రోజాలు జగన్మోహన్ రెడ్డిని భగవంతుడి గా అభివర్ణించే ప్రయత్నాన్ని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ లో పెయిడ్ ఆర్టిస్ట్ ఒకరు తన కలాన్ని తాకట్టు పెట్టి కిరాయి వ్యాఖ్యలు రాసి, మంత్రుల చేత పలికిస్తున్నారన్నారు.
సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…. తిరుమల, శ్రీశైలం గుట్టలు సముద్రానికి దగ్గరగా లేవు. సముద్ర మట్టానికి 150 నుంచి 250 మీటర్ల పరిధిలో సి ఆర్ జెడ్ జోన్ నిబంధనలు ఉంటాయి. రిషికొండ పై టూరిజం కాటేజీల ముసుగులో జగన్మోహన్ రెడ్డి నిర్మించిన అక్రమ భవనం సి ఆర్ జెడ్ జోన్ పరిధిలోకి వస్తుందన్నారు. సి ఆర్ జెడ్ జోన్ లో కొన్ని నిబంధనలు ఉంటాయన్న అవగాహన కూడా లేకుండా మాట్లాడిన ఇద్దరు మంత్రులు జ్ఞాన శూన్యులేనని అర్థమవుతోందన్నారు .
సి ఆర్ జెడ్ జోన్ పరిధిలో పర్యాటక కార్యకలాపాలకు మాత్రమే కొంతమేర అనుమతిని ఇస్తారు. సముద్రానికి 150 మీటర్ల దూరంలో నివాస సముదాయాన్ని కట్టుకొని పొద్దున్నే లేచి భార్యాభర్తలిద్దరికీ సముద్రాన్ని చూడాలనుకునే పిచ్చి ఏమిటో అర్థం కావడం లేదు. ప్రజా వేదికలో తొలి సమావేశాన్ని ఏర్పాటు చేసి, అనుమతులు లేకుండా ఈ భవనాన్ని నిర్మించారని కూల్చివేసి జగన్మోహన్ రెడ్డి నీతి వ్యాఖ్యలు, సోది వ్యాఖ్యలు చెప్పారన్నారు. రిషికొండపై నిర్మాణాల దరఖాస్తులోనే అనేక లోపాలు ఉన్నాయి. నాలుగు బ్లాకులకు నాలుగు పేర్లు పెట్టి, ముఖ్యమంత్రి నివాస సముదాయం, వ్యక్తిగత క్యాంప్ కార్యాలయం, కార్యదర్శుల కార్యాలయాన్ని నిర్మించారన్నారు.
రిషికొండపై నిర్మించింది ముఖ్యమంత్రి నివాస భవన సముదాయమే నన్న రఘురామ కృష్ణంరాజు, ఇది నిజం కాదని నిరూపించాలంటూ ముఖ్యమంత్రిని సవాల్ చేశారు. రిషి కొండపై నిర్మాణాలకు టూరిజం కార్యకలాపాలకు సంబంధం లేదు. రాష్ట్రంలో 100% మళ్లీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. రిషి కొండ పై నిర్మించిన ఈ భవన సముదాయాన్ని భార్యాభర్తల పేరు మీద కాకుండా, వేరొకరి పేరు మీద 99 సంవత్సరాలు లీజుకు తీసుకోని వారి వద్ద నుంచి భార్యాభర్తలిద్దరూ కొద్ది కాలం పాటు అద్దెకు తీసుకున్నట్టు గా ప్రజల్ని నమ్మించడానికి కుట్ర జరుగుతున్నట్టు వార్తా కథనాలు వినిపిస్తున్నాయి. రిషి కొండపై నిర్మించింది పూర్తిగా అక్రమ కట్టడం. సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుకు భిన్నంగా నిర్మాణాలను చేపట్టారు.
గతంలో కాటేజీలు ఉన్నచోట వాటిని తొలగించి, అదే స్థలంలో నిర్మాణాలు చేపట్టాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం గతంలో కాటేజీలు ఉన్నచోట కాకుండా కొండ దిగువన భారీ భవన నిర్మాణాన్ని చేపట్టింది. విశాఖపట్నం నుంచి భీమిలికి వెళ్లి ప్రధాన రహదారి పక్కనే ఈ నిర్మాణాలు చేపట్టారు. తప్పు చేశారు కాబట్టే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మంత్రులు పిచ్చివాగుడు, డబ్బా వాగుడు వాగుతున్నారు. మంత్రులతో ముఖ్యమంత్రి ఇలా మాట్లాడించడం మన కర్మ. ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వనని చెబుతున్న పవన్ కళ్యాణ్, ప్రభుత్వం మారిన తర్వాత ఢిల్లీలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చిన విధంగానే, విశాఖలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూడా కూల్చివేస్తామని తన విశాఖపట్నం పర్యటనలో చెప్పారు.
ముఖ్యమంత్రి టూరిజం ముసుగు కాటేజీల ముసుగులో కొత్త కాపురం కోసం నిర్మించుకున్న భవనాన్ని కూడా కూల్చివేయాలని రఘురామకృష్ణం రాజు కోరారు. కూల్చివేసే బాధ్యతను రేపు నూతనంగా ఏర్పడనున్న ప్రభుత్వం తీసుకోవాలి. ఈ భవన సముదాయ నిర్మాణానికి వంద కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లుగా చెబుతున్నారు. ఈ పాలకుల వల్ల ప్రజలు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయాము. పనికిమాలిన పాలకులకు గుణపాఠం రావాలంటే, ఈ తరహా అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందేనని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
రిషికొండ అక్రమ నిర్మాణం పై నా ప్రస్తుత పార్టీ అధికారిక వెబ్సైట్లో ఒక ట్వీట్ చేశారు. రిషి కొండపై సెక్రటేరియట్, సెక్రటరీల భవన సముదాయాన్ని నిర్మిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ భవనాలు కడితే తప్పా అని ప్రశ్నించిన కొద్దిసేపటికే, ఆ ట్వీట్ ను తొలగించారు. కోర్టు ధిక్కరణ కింద అడ్డంగా దొరికిపోతామనే ఆ ట్విట్ తొలగించి వేశారు. ఆ తరువాత తమ వంది మాగాదులను రంగంలోకి దింపి, వారి చేత నోటికొచ్చినట్లు మాట్లాడించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.