దేశంలో రోజు రోజుకూ కరోనా వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ వ్యాధికి సంబంధించిన హెల్త్ ఇన్ ష్యూరెన్స్ పై జీఎస్టీని రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘు రామకృష్ణంరాజు కేంద్ర ఆర్ధిక మంత్రిని కోరారు. నేడు ఆయన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఒక లేఖ రాశారు.
దేశం ఇప్పుడు ఎంతో క్లిష్టపరిస్థితుల్లో ఉందని ఒక వైపు కరోనా విజృంభణ మరో వైపు చైనాతో యుద్ధ వాతావరణం కలవరం కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ దశలో కరోనా రోగులకు భరోసానివ్వడం అత్యవసరమని, అందుకోసం కేంద్రం సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
కరోనా వైరస్ చికిత్స కోసం ఎంతో మంది ఆరోగ్య బీమా పథకాలు తీసుకుంటున్నారని దీనిపై జీఎస్టీ విధిస్తున్నారని రఘు రామకృష్ణంరాజు అన్నారు. ఈ క్లిష్ట సమయంలో కోవిడ్ 19కు సంబంధించిన ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీ రద్దు చేయాలని దీనివల్ల కొంత మేరకు ప్రజలకు ఉపశమనం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని తన నియోజకవర్గమైన నర్సాపూర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల వారు తనకు ఈ విషయాన్ని విన్నవించారని, ఈ కారణంగా సత్వర చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని ఆయన అన్నారు.