ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ కు వెళ్లి వచ్చిన వారు స్వచ్చందంగా కరోనా పరీక్షలు చేసుకోవాలని కడప జిల్లా రాజంపేట డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి తన కార్యాలయంలో నేడు మీడియా సమావేశంలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలా చేసుకోక పోతే మీ కుటుంబ సభ్యులతో పాటూ అందరూ నష్టపోతారని అన్నారు.
సకాలంలో చికిత్స చేసుకుంటే ఫలితం ఉంటుందని, లేకుంటే ప్రాణహాని తప్పదని హెచ్చరించారు. ఇప్పటి వరకు రాజంపేట లో కరోనా పాజిటివ్ రాలేదని, నిర్లక్ష్యం వహిస్తే వచ్చే అవకాశం ఉందన్నారు.
పాజిటివ్ వస్తే ఆ రోగి ఇంటి చుట్టు మూడు కిలోమీటర్ల పరిధిని కోర్ ఏరియాగా గా ప్రకటిస్తామని, ఆ ప్రాంతం పోలీసుల అధీనం లోకి వెళుతుందన్నారు. ఎనిమిది కిలోమీటర్ల పరిధిని బఫర్ జోన్ గా ప్రకటిస్తామని, అవసరమైన మేరకు చెక్ పోస్ట్ లు పెట్టి నిబంధనలు మరింత కఠినతరం చేస్తామని తెలిపారు.
మీరు ఇబ్బంది పెట్టి అందరిని ఇబ్బంది పెట్టొద్దని, ఇప్పటికే జిల్లాలో కరోనా కేసులు 19 నమోదు అయ్యాయని, ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని, పుకార్లు నమ్మవద్దు..పుకార్లు పుట్టించవద్దని కోరారు. కాగా ఈ సందర్భంగా డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి ఆధ్వర్యంలో మీడియా మిత్రులకు ఆత్మీయ సమావేశం అనంతరం విందు ఏర్పాటు చేశారు.
ఇందులో మీడియా వారితో పాటు పట్టణ ,రూరల్ ఎస్సైలు ప్రతాప్ రెడ్డి, హనుమంతు పోలీసు సిబ్బంది హాజరయ్యారు. డీఎస్పీ ని ఈ సందర్భంగా కండువా కప్పి సత్కరించారు.