భారత ప్రధానుల్లో అత్యంత పిన్న వయస్కుడు దివంగత నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వాణిజ్యం మరియు సరఫరా, విదేశీ వ్యవహారాలు, పరిశ్రమలు మరియు కంపెనీ వ్యవహారాలు, శాస్త్ర, సాంకేతిక, అణు విద్యుత్తు, అంతరిక్షం, ఎలక్ట్రానిక్స్, సముద్రాభివృద్ధి, సిబ్బంది మరియు పరిపాలనా సంస్కరణలు, క్రీడలు, యువజన వ్యవహారాలు, సంసృతి, పర్యాటకం మరియు పౌర విమానయానం మొదలైన మంత్రిత్వ శాఖల బాధ్యతలను చేపట్టి ఎంతో సమర్థ వంతంగా నిర్వహించారని గుర్తు చేశారు.
శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచంలోనే దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడానికి ఎంతో కృషి చేశారని అన్నారు. వయోజన ఓటు హక్కు కల్పించి ప్రతి ఒక్కరిని ప్రజాస్వామ్యంలో భాగస్వాములు చేశారని కొనియాడారు.ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రాజీవ్ గాంధీ స్ఫూర్తి తో కలిసి పని చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలని తెలిపారు.
నగర కాంగ్రెస్ అధ్యక్షులు,ఖమ్మం నియోజకవర్గ పి సి సి సభ్యులు మహమ్మద్ జావేద్ పిసిసి సభ్యులు రాయల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ…సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ప్రపంచం గర్వించే స్థాయిలో దేశాన్ని అగ్రస్థానంలో నిలిపారని అన్నారు.గొప్ప రాజకీయ వారసత్వ నేపథ్యం మరియు దిగ్గజ నేతలతో కూడిన ఉన్నత కుటుంబంలో జన్మించిన రాజీవ్ గాంధీ దేశాన్ని కొత్త దిశగా నడిపించారు. 1984 లో తన తల్లి ఇందిరా గాంధీ మరణానంతరం ఆయన దేశానికి 6 వ ప్రధానిగా సేవలందించారని కొనియాడారు. అనంతరం నగరంలో గల రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.