విజయనగరం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థం శ్రీకోదండ రామస్వామి ఆలయ పునః నిర్మాణానికి ఈ నెల 22వ తేదీన శంకుస్థాపన జరగనుంది. బోడికొండపై పాత ఆలయం ఉన్న చోటే దాదాపు 3 కోట్ల వ్యయంతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయబోతోంది. ఈ మేరకు 22వ తేదీ ఉదయం 10.08 గంటలకు జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్, కమిషనర్ హరిజవహర్లాల్ తదితరులు పాల్గొంటారు. గతేడాది డిశెంబరు 28వ తేదీ అర్ధరాత్రి కొందరు దుండగులు బొడికొండపై ఉన్న రాములోరి విగ్రహ శిరస్సు తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విగ్రహాల ప్రతిష్టతో పాటు ఆలయం మొత్తాన్నీ పునః నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. కొండ రాయితో ఉండే పాత ఆలయం స్థానంలో డ్రస్డ్ గ్రానైట్ రాయితో అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ ప్రణాళికలు సిద్దం చేసింది కూడ. ఆగమ సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ పునః నిర్మాణానికి దేవదాయ శాఖ, ఇంజినీరింగ్ అధికారులు డిజైన్లు సిద్ధం చేశారు. శంకుస్థాపన తర్వాత 6 నెలల వ్యవధిలోనే పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దేవదాయ శాఖ అధికారి వాణీ మోహన్ తెలిపారు.
ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్. నెట్, విజయనగరం