యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివారు సూర్యప్రభ వాహనంపై తిరుమాఢ వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు అన్నప్రసాదాలు, పాలు, నీరు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
సాయంత్రం 5 గంటలకు స్వర్ణ రథంపై మాఢవీధుల్లో స్వామివారు ఊరేగింపు ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
వైవస్వత మన్వంతరం లో సూర్యుడు రథాన్ని మాఘ శుక్ల సప్తమి నాడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే రథ సప్తమి అంటారు. రథ సప్తమి నాడు తప్పక సూర్యుని ఆరాధన చేయడం, ఆదిత్య స్తవం, ఆదిత్య హృదయం వంటి స్తోత్రములతో పారాయణం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. తిలోదకములు సూర్యోదయం సమయంలో పితృదేవతలను ఉద్దేశించి ఇస్తే 1000 సం౹౹ శ్రద్ధతో యథావిధిగా శ్రాద్ధము పెట్టిన మహాఫలితం వస్తుంది.