విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వెంట వందేభారత్ రైలును ప్రారంభించాలని పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కోరారు. అలాగే తిరుతికి వెళ్లే భక్తులకు వీలుగా సికింద్రాబాద్– తిరుపతి మధ్య వయా పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా వందేభారత్ రైలును ప్రారంభించాలని కూడా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కి ఎంపీ విన్నవించారు. తయారీ, సేవా రంగానికి ప్రధాన ప్రోత్సాహాన్ని అందించడానికి, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలను
నెరవేర్చడానికి.. ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్లో కీలకభాగమై, జాతీయ ప్రాముఖ్యత కల్గి ఉన్న విశాఖపట్నం –చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వెంట వందేభారత్ ఎక్స్ప్రెస్ రైల్ను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. 800కి.మీ పొడవైన ఈ కారిడార్ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి.. ఈ రైలు ద్వారా అనుసంధానం ఏర్పడి.. వ్యాపారస్తులకు ప్రయాణాన్ని వేగవంతం చేస్తోందని, రెండు ప్రాంతాల మధ్య అపారమైన వ్యాపార అవకాశాలను సృష్టించడంతో పాటుగా సరఫరా గొలుసును ప్రోత్సహించి, అంతర్ రాష్ట్ర వ్యాపారాన్ని విస్తరించుటకు, ఉపాధి అవకాశాలు కల్పించుటకు
సహాయపడుతుందన్నారు. ఈ కారిడార్ అభివృద్ధి కోసం ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తన మద్దతును ఇవ్వడం అనేది ఈ కారిడార్ ప్రాధాన్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కారిడార్లో ఉన్న విశాఖపట్నం అతిపెద్ద ఓడరేవుగా, పారిశ్రామిక కేంద్రంగా ఉందని, ఈ కొత్త రైలు వల్ల మరింత వృద్ధి పెరుగుందని పేర్కొన్నారు. అలాగే..సికింద్రాబాద్– తిరుపతి మధ్య పిడుగురాళ్ల– గుంటూరు మీదుగా వందేభారత్ రైలును ప్రవేశపెట్టాలని, తెలంగాణాలోని సికింద్రాబాద్ ప్రాంతం నుండి ఏటా లక్షలాది మంది తిరుపతిలోని ఆలయాలను సందర్శించుటకు వస్తుంటారని తెలిపారు.
గుంటూరు రైల్వే డివిజిన్లో..ఆదర్శ స్టేషన్గా ఎంపిక కాబడిన పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ మీదుగా గుంటూరు మీదుగా వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రవేశపెట్టడం అత్యవసరం అని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నుండి ఎక్కువగా వస్తున్న డిమాండ్ అని మంత్రికి విన్నవించారు.