పట్టణ ప్రగతి తో చేసిన పాపాలను కడిగేసుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల కోసం పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రజలను మోసం చేసేందుకు మరొక మారు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన అన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూంలు ఇస్తామని చెప్పి ఇన్ని నెలలు గడుస్తున్నా ఎలాంటి ఫలితం ప్రజలకు కలుగలేదని రేవంత్ రెడ్డి అన్నారు.
30లక్షల మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానూ, గ్రేటర్ పరిధిలో 10లక్షల మంది డబుల్ బెడ్ రూమ్ పొందే అర్హులు ఉన్నారని అయితే వారికి ఇవ్వడం లేదని ఆయన అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఏడాదిలో పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోతే ఎమ్మెల్యే ఎన్నికలలో ఓట్లు అడగమని చెప్పారని అయితే ఆయన ఇళ్లు మాత్రం కట్టలేదని రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ పరిధిలో 1లక్ష డబుల్ బెడ్ ఇండ్లు ఇస్తామని కేవలం 108 మాత్రమే ఇచ్చారని ఆయన తెలిపారు. కేసీఆర్ మాట నమ్మినందుకు పేద ప్రజల పై ఐదేళ్లలో ఒక్కో కుటుంబం పై 3లక్షల భారం పడిందని, 1లక్ష 50వేల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో 9వందల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బకాయిలు చెల్లించలేకపోతుందని ఆయన అన్నారు. పేదలకు అందించాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై టీఆరెస్ నేతలు కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రధాన మంత్రి అవాస్ యోజన నిధులు దారి మళ్లుతుంటే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఎందుకు రివ్యూ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. టీఆరెస్-బీజేపీ మధ్య ఉన్న అంతర్గత సంబంధాలు ఏంటో ప్రజలు దృష్టి పెట్టాలని ఆయన కోరారు.