రాయలసీమ రతనాలసీమగా మారాలన్నా, ప్రజల తలరాతలు మార్చాలన్నా కావలసింది భారీ నీటి ప్రాజెక్టులు, పరిశ్రమలకి పెట్టుబడులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు తప్ప మూడు రాజధానులు కాదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. రాయలసీమలో ప్రకృతి సిద్ధంగా అపారమైన సున్నపురాయి ముగ్గురాయి ఇనుపరాయి ఆస్ బెస్టాఫ్ పింగాని ఉత్పత్తికి ఉపయోగపడే బంక మట్టి లాంటి ప్రకృతి ఖనిజ సంపదలు పుష్కలంగా ఉన్నాయి. కేంద్ర,రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా మన్నవరం బెల్ పరిశ్రమ, దుగ్గిరాజపట్నం ఓడరేవు, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ సైతం దరిచేరని రాయలసీమగా మారింది.
రాష్ట్రానికి “ప్రత్యేక హోదా” వస్తే భారీ పరిశ్రమలు రాయలసీమ వైపు పరుగులు తీస్తాయి,పెట్టుబడిదారులు “క్యూ” కడతారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదాపై రాజీలేని పోరాటం చేస్తామని కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతామన్న ఉత్తర కుమారుని ప్రగల్పాలు “దింపుడు కళ్లెం” ఆశలా మారిందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని గతంలో పరిపాలించిన పాలకులు ఏం చేశారు అని ప్రశ్నించడం మాని మనం ఏం చేస్తున్నాం అన్నదానిపై అధికార పక్షం ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన హితవు చెప్పారు.
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD),ఎస్.వి యూనివర్సిటీ,విద్యుత్ శాఖ, నగరపాలక సంస్థ,స్విమ్స్,రుయా లాంటి అనేక ప్రభుత్వ కార్యాలయాలలో దీర్ఘకాలికంగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన మాటలు నీళ్ల మూటలుగా మారిందని ఆయన అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఖాళీగా ఉన్న సుమారు 8000 ఉద్యోగ నియామకాలను ప్రేసిడెన్షియల్ ఉత్తర్వుల ప్రకారం 75% శాతం రాయలసీమ ప్రాంత నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాజధాని ముసుగులో రాజకీయ స్వలాభాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఐదు కోట్ల మంది ప్రజల జీవితాలను కుక్కలు చింపిన విస్తరిలా మార్చకండని ఆయన అన్నారు. రాజధాని విషయంలో మూడు ముక్కలాటను పక్కనపెట్టి నీటి ప్రాజెక్టులు,పరిశ్రమల స్థాపన, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలపై దృష్టి పెడితే రాయలసీమ సస్యశ్యామలమవుతుందని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.