మంత్రి పదవి ఇవ్వనందుకు శాసనసభ్యులు ఎవరు కూడా బాధపడరు. కానీ మర్యాద ఇవ్వకపోతే బాధపడతారు. శాసనసభ్యులకు ఎందుకు మర్యాద ఇవ్వవు?, అందర్నీ నువ్వు, నువ్వు అంటూ పిలుస్తావు… నిన్ను మాత్రం ఎమ్మెల్యే లు, సార్…మీరు అని పిలువాలా?, ఇదేమి పద్ధతి. అవకాశం దొరికితే ఎవరైనా గూబ గుయ్యి మనిపిస్తారు… ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే చేశారు.
ఇది అంతం కాదు ఆరంభం మాత్రమేనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మీ విధానాలు, అరాచకాలు నచ్చకనే ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన వారు నిజమైన తెలుగు బిడ్డలు. ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని ఇన్చార్జిలను వేయడం, బుద్ధున్న వారు చేసే పనేనా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను మనుషులుగా ట్రీట్ చేస్తే some తృప్తి ఉంటుంది. మర్యాదగా ఉంటుంది. కానీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కనీసం గౌరవించక పోతే, ఇటువంటి పరిస్థితులే పునరావృత్తం అవుతాయని రఘురామకృష్ణం రాజు అన్నారు.
అమ్మ బాబుకు పుట్టిన వారు పార్టీ మారరన్న ఓ ముష్కరుడు
తెలుగుదేశం పార్టీ వీడి, ఓ నలుగురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలో చేరారు. అమ్మ, బాబుకు పుట్టిన వారెవరు ఇలాగా పార్టీ మారరు అంటూ దిక్కుమాలిన ఓ దరిద్రుడు ఒకప్పటి ప్రముఖ ఛానల్ లో కూర్చొని మాట్లాడాడు. ఎవరి ఆముష్కరుడు అన్నట్లు. టిడిపి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, దాచేపల్లి గణేష్, కరుణం బలరాం లలో ఎవరిని అంత మాట అన్నది. పార్టీలోకి వారిని సిగ్గు లేని వెధవలు తీసుకున్నారు.
ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యే లాక్కొని, ఇప్పుడు వెధవ వ్యాఖ్యలు చేస్తారా?. ఈ వ్యాఖ్యలకు అర్థం పర్థం ఏమైనా ఉందా?, ఒకవేళ బాధపడితే సొంత పార్టీ వాళ్లు బాధపడాలి. టిడిపి నాయకులు ఎప్పుడు కూడా ఆ నలుగురు ఎమ్మెల్యేల గురించి ఇంత అసహ్యంగా మాట్లాడలేదు. జనసేన పార్టీ నుంచి ఎన్నిక గెలిచినా రాపాక వరప్రసాద్ గురించి కూడా, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అసభ్యంగా మాట్లాడలేదు. ఒకవైపు శ్రీరంగనీతులు చెబుతూనే, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను లాక్కొని వెధవ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. ఆ పార్టీకి చెందిన సభ్యుడిగా నలుగురు ఎమ్మెల్యేలకు తాను క్షమాపణలు చెబుతున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకొని, ఆ ముష్కరుడితో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు సారీ చెప్పించాలి అని రఘు రామకృష్ణం రాజు అన్నారు.
ఏ నిమిషానికి ఏమి జరుగునో…
తెలుగులో ఆల్ టైం రికార్డ్ సృష్టించిన లవకుశ చిత్రంలోని ఏ నిమిషానికి ఏమి జరుగునో… అనే పాట తరహాలో, తమ పార్టీలో పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అత్యంత బలవంతుడిని, సింహాన్ని అని చెప్పుకునే వ్యక్తికి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలకు క్యాంపులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొనడం దురదృష్టకరం. ప్రజలు 151 స్థానాలలో గెలిపించిన తర్వాత కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా, ప్రస్తుతం తమ పార్టీ పెద్దలకు టిడిపి చెప్పు దెబ్బ తగిలినట్లు అయిందని రఘురామ కృష్ణం రాజు అన్నారు.
ఇతర పార్టీల నుంచి లాక్కొన్న ఐదు మంది ఎమ్మెల్యేలను కూడా తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటు వేయాలని సూచించడం సిగ్గుచేటు. ఎమ్మెల్యే లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లను తాము పరిగణలోకి తీసుకోలేదని, టిడిపి, జనసేన నుంచి తమ పార్టీలో చేరిన వారిని ఏ ప్రాతిపదికన తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటు వేయాలని సూచించారో అర్థం కావడం లేదు. ఇతర పార్టీల శాసనసభ్యులను తమ పార్టీలో చేర్చుకోమని చెప్పి, ఇప్పుడు చేర్చుకోవడానికి సిగ్గుండాలి.
తనకు తానే శ్రీరామచంద్రునిగా చెప్పుకునే వ్యక్తి, ఇతర పార్టీ ఎమ్మెల్యేలను బాహాటంగా చేర్చుకోవడాన్ని బహిరంగ వ్యభిచారం చేయడమని అనరా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి 5 మందిని చేర్చుకున్నామని, వారిని తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటు వేయాలని సూచించామని ప్రభుత్వ సలహాదారు సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి బాహాటంగానే మీడియా ముందు చెప్పినప్పటికీ, స్పీకర్ వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అనర్హులు గా ఎందుకు ప్రకటించడం లేదని ఆయన నిలదీశారు.
నలుగురు… 40 మంది కావొచ్చు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగుబాటు చేసిన నలుగురు ఎమ్మెల్యేలే, రేపు 40 మంది కావచ్చు. ఎవరా నలుగురు అన్నది సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలి. పరిస్థితిని చక్క దిద్దుకోకపోతే యువరాజు చిత్రంలో ఏరా నలుగురు అనే పాటను ముఖ్యమంత్రి పాడుకుంటూ గడపాల్సి వస్తుంది. ఇంకా అవమానాలను భరించే, సహించే శక్తి ఒక్కరిద్దరు జాకోగాళ్ళకు మాత్రమే ఉంటుంది. సిగ్గు ఉన్న ప్రతి ఒక్కరూ తిరగబడతారు. కొడితే కొడుతారు . తిడితే తిడతారు. గతంలో చాలామంది ఎమ్మెల్యేలను కొట్టి ఉంటారు. మళ్లీ కొడుతామంటే వారు ఊరుకునే పరిస్థితి లేదు.
మీరు మీ పరిమితుల్లో ఉండడం మంచిదని జగన్మోహన్ రెడ్డి ని పరోక్షంగా రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. రెడ్డి సామాజిక వర్గంలో ఎంతోమంది ఉద్దండులైన నాయకులు ఉన్నారు. గతం లో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డి వంటి లబ్ద ప్రతిష్టులైన నాయకులు ఉండగా, ఇటీవల కొంతమందిని చూస్తే బాధ అనిపిస్తుంది. తానేమీ రెడ్డి వ్యతిరేకిని కాను. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎంతో మందితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ తనని తిట్టిన దరిద్రులను మాత్రమే తాను తిట్టానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
చిల్లు పడ్డ నావ వైకాపా పార్టీ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చెల్లుపడ్డ నావ మాదిరిగా తయారయింది. చిల్లుపడిన నావలో ఎవరు ప్రయాణం చేయాలని అనుకోరు. ఇప్పటికైనా పరిణితి చెందిన నాయకుడిగా వ్యవహరిస్తే పార్టీ పరిస్థితి బాగుపడవచ్చు. అయినా తన వైఖరిని మార్చుకోను అంటే ప్రతిపక్షాలకు మరిన్ని విజయాలు దక్కవచ్చు. ఇప్పటివరకు కొద్దిమంది మాత్రమే నోరు విప్పారు. నోరు విప్పలేని ఎంతోమంది తరపున తాను ముఖ్యమంత్రిని కోరేది ఏమిటంటే… ఎమ్మెల్యేలకు నేరుగా కలిసే అవకాశాన్ని కల్పించండి.
కేంద్ర మంత్రులను ఎవరైనా ఎంపీలు కలిస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించడం మానండి. ఎవరైనా కేంద్రమంత్రిని కలవాలి అంటే, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిని వెంటబెట్టుకోని వెళ్లాలని నిబంధనలు ఇకపై విధించకండి. గతంలో ఇదే తరహా నిబంధనలను పెట్టారు. తమ పార్టీ ఎంపీలలో అందరికంటే ఎక్కువగా కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలు తనకు ఉన్నాయి. మంత్రులతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్న తాను విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డితో కలిసి వెళ్లాల్సిన అవసరం ఏముంది?, వారి కంటే ఎక్కువగానే కేంద్ర మంత్రులతో తాను భేటీ అయ్యాను.
ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యులకు గౌరవం ఇవ్వండి. వారేమి మీ దొడ్లో పశువులు కాదు. కట్టివేయాలని చూడకండి. ఇప్పటికైనా మీరు మారాలి. మారకపోతే ప్రజలే మిమ్మల్ని మారుస్తారని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో విజయం సాధించిన టిడిపి ఎమ్మెల్సీ అనురాధను రఘురామకృష్ణం రాజు అభినందించారు. ఆమె ఇంకా మరిన్ని ఉన్నత స్థానాలకుఎదగాలని ఆకాంక్షించారు.