ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావుకు బెయిల్ రద్దు చేయడానికి సుప్రీం నిరాకరించింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఊహించని రీతిలో షాక్ తగిలినట్లయ్యింది. జగత్ జనని చిట్ ఫండ్ కంపెనీలో అక్రమాలు ఆరోపణలతో ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు ఆదిరెడ్డి వాసులను సీఐడీ అరెస్ట్ చేసింది.
అయితే ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సీఐడీ సుప్రీంలో సవాలు చేసింది. బుధవారం నాడు ఈ పిటిషన్పై సుప్రీంలో విచారణకు రాగా.. సీఐడీ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలను వినిపించారు. ఆదిరెడ్డి అప్పారావు తరపున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్ధ లూథ్రా హాజరయ్యారు. విచారణకు సహకరించాలని ఆదిరెడ్డి అప్పారావుకు సుప్రీం సూచించింది. విచారణకు సహకరిస్తారని సుప్రీంకు సిద్ధార్థ లూథ్రా హామీ ఇచ్చారు. దీంతో ఆదిరెడ్డి అప్పారావు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.