పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పక్కదారిపడుతున్నాయి. పీడీఎస్ బియ్యం రవాణాపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినప్పటికీ పలు మిల్లుల్లో రీసైక్లింగ్ దందా యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పలు రైస్ మిల్లుల్లో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నగర పరిధిలో పేదల నుంచి సేకరిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని దళారులు రైస్ మిల్లులకు విక్రయిస్తున్నారు. ఇక్కడ నుంచి కాకినాడకు యథేచ్ఛగా రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేయడం నిత్య కృత్యంగా మారింది. సివిల్ సప్లై అధికారులు, టాస్క్ ఫోర్స్ బృందాలు నామమాత్రంగా ఒకటి , రెండు చోట్ల లారీలను, ఆటోలను సీజ్ చేస్తూ మమ అనిపిస్తున్నారు.
తెలుపు కార్డు ఉన్న లబ్దిదారులందరూ రేషన్ బియ్యాన్ని తమ రోజువారీ ఆహారంలో విరివిగా వినియోగించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రజల వద్ద రేషన్ బియ్యం పేరుకుపోతున్నాయి. దీంతో లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళుతున్న దళారులు ఇంటింటికీ తిరిగి రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారు… కిలో రూ.8 నుంచి రూ.10 చొప్పున చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని రైసు మిల్లర్లకు కిలో రూ.15 నుంచి రూ.15 చొప్పున అమ్ముకుంటున్నారు.
రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా వెనక అధికారులు…!?
నవ్యనగరం మంగళగిరి లో రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా వెనక పౌరసరఫరాలశాఖ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు రైస్ మిల్లుల యజమానులు దళారులు చేత తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేయించి ఆపై తమ మిల్లు పేరుతో ఉన్న లేబుల్ బస్తాల్లో నింపి ఎఫ్సీఐకి ఇస్తున్నట్లు తెలుస్తోంది. రైస్ మిల్లుల యజమానులు రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కోట్లలో సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రేషన్ బియ్యం అక్రమ రవాణా, రీసైక్లింగ్ దందాపై ఉక్కుపాదం మోపుతున్నామని పైకి చెబుతున్న పౌరసరఫరాల శాఖ అధికారులు లోపాయికారిగా అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సివిల్ సప్లై అధికారులు, టాస్క్ ఫోర్స్ బృందాలు ఎన్నిసార్లు దాడులు చేసి రేషన్ బియ్యం రీసైక్లింగ్ను పట్టుకుంటున్నా దందా మాత్రం ఆగడం లేదు.
తాజాగా ఆత్మకూరు గుంటూరు ఛానల్ వద్ద గల శంకర్ రైస్ మిల్లులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి 432 క్వింటాళ్ల రీసైక్లింగ్ రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారంటే. మిల్లర్ల దందా ఎంత భారీగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. నిత్యం ఈ తంతు జరుగుతున్నా సంబంధిత శాఖలకు మిల్లర్లు మామూళ్లు సమర్పించని సమయంలో విజిలెన్స్ అధికారులు చేత ఇలా దాడులు చేయిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఇప్పటికైనా రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేస్తూ కోట్లాది రూపాయలను గడిస్తోన్న రైస్ మిల్లులపై ఉన్నతాధికారులు ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నాగరాజు నాయుడు, జర్నలిస్ట్