ఎకౌంట్ లో మినిమం బ్యాలెన్సు లేకపోతే ఖాతాదారులకు జరిమానా విధించే బ్యాంకులకే ఇప్పుడు జరిమానా విధించే పరిస్థితి వచ్చింది. బ్యాంకులు ఏటిఎంలలో డబ్బుల నిల్వలు సరిగా ఉంచకపోతే రిజర్వు బ్యాంకు సంబంధిత బ్యాంకుకు జరిమానా విధించబోతున్నది.
ఏటీఎంలలో డబ్బు నిల్వ లేకపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 1 నుంచి తాజా నిబంధన అమల్లోకి వస్తుందని రిజర్వు బ్యాంకు ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఏటీఎంలు ఖాళీ అయిన వెంటనే బ్యాంకులు తిరిగి డబ్బు నింపకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తమ దృష్టికి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో వాటిలో నోట్ల లభ్యతను పర్యవేక్షించే వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిందిగా బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం (డబ్ల్యూఎల్ఏ) ఆపరేటర్లను ఆదేశించినట్లు పేర్కొంది.
డబ్ల్యూఎల్ఏల్లో నగదు అందుబాటులో లేకపోతే.. వాటికి డబ్బు అందజేసే బాధ్యతను కలిగి ఉన్న బ్యాంకులకు జరిమానా విధిస్తామని తెలిపింది.
అదే విధంగా నో సర్వీస్ బోర్డులు పెట్టడం పై కూడా రిజర్వు బ్యాంకు సీరియస్ అయింది. ఏటిఎం ల వ్యవస్థలను బ్యాంకులు బలోపేతం చేసుకోవాలని ఆదేశించింది.