ఈ నెల 25న సీఎం జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశం కూడా ఉందని మాజీ మంత్రి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డిసంచలన ప్రకటన చేశారు.
ఆయన ప్రకటనతో ఒక్క సారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంచలనం కలిగింది. ఇతర రాజకీయ పార్టీల నాయకులు ఇప్పటి వరకూ ఈ విషయంపై వ్యాఖ్యానించారు తప్ప బీజేపీ నేతలు ఎవరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూల్చి వేసే ప్రయత్నం చేస్తున్నదని ఆ పార్టీ నాయకులు ఆరోపించడంతో బీజేపీ కూడా జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రారంభించింది.
ఈ క్రమంలోనే బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉన్నత పదవిలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, ఈ కారణంతో ఆయన బెయిల్ రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో సీబీఐ వాదనలు వినిపించేందుకు గడువు తీసుకోవడంతో కేసు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు కోర్టే నిర్ణయం తీసుకోవాలని సీబీఐ కోరడంతో తుది తీర్పు ఈ నెల 25న రానున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుడు ఇలాంటి ప్రకటన చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది.
జగన్ తనకు తానే గోతులు తవ్వుకుంటూ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చే కుట్ర చేస్తోందని ఆరోపించడం సరికాదని కూడా ఆదినారాయణ రెడ్డి అన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై నీచమైన పదజాలంతో దాడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వడంలేదని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విధానం లేకుండా ఇష్టమొచ్చినట్లు అప్పులు చేసి దాన్ని సమర్ధించుకుంటున్నారని ఆదినారాయణ రెడ్డి అన్నారు.