గిరిజన సంక్షేమ శాఖ లో అమలవుతున్న పథకాలు లబ్దిదారులకు చేరడంలో మరింత సమర్ధవంతంగా పనిచేయడం తదితర అంశాలపై హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నేడు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, జిల్లాల గిరిజన అభివృద్ధి అధికారుల సమీక్షా సమావేశం జరిగింది.
గిరిజన విద్యాలయాలు పునః ప్రారంభం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన విద్యార్థుల ఇంటి వద్దకే ఉపాధ్యాయులు వెళ్లి పాఠాలు చెప్పడం లాంటి వినూత్న అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఐటీడీఏ లలో గిరిజన సమస్యల్ని సత్వర పరిష్కారం చేయడం పై రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ కోవిద్ సమయంలో ఆగిపోయిన పనులను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వచ్చినా, పరిశ్రమలు వచ్చినా ఇవి గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఉపయోగపడేలా పని చేస్తున్నామని ఆమె తెలిపారు. గిరిజన గ్రామాల్లో 3 ఫేజ్ కరెంట్ కోసం 117కోట్ల రూపాయలు కేటాయించామని, వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాలకు పాడి పశువులను ఇవ్వడం ఒక పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు.
ఎకానామిక్ సపోర్ట్ స్కీమ్స్ కింద ఇప్పటికే దాదాపు 500 మంది గిరిజన యువతకు ఓనర్ కమ్ డ్రైవర్ పథకంలో కార్లు ఇచ్చామని మంత్రి వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో ఏజెన్సీ లో సరైన వసతులు లేని గిరిజన విద్యార్థుల వద్దకు వెళ్లి విద్యా బోధన చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని మంత్రి తెలిపారు.