ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు నేడు లేఖ రాశారు.
శ్రీశైలం కుడి ప్రధాన కాల్వ నుంచి పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ కు నాలుగు కిలోమీటర్ల దిగువన చేపడుతున్న ఈ ప్రాజెక్టు చట్ట విరుద్ధమని ఆయన అన్నారు. రోజుకు మూడు టిఎంసిల నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ద్వారా అక్రమంగా వినియోగించుకోబోతున్నదని అందువల్ల కేంద్ర ప్రభుత్వం దీన్ని తక్షణమే అడ్డుకోవాలని చల్లా వంశీచంద్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు.
కృష్ణా బోర్డు ఆదేశాలు ధిక్కరిస్తున్న ఏపి ప్రభుత్వం
రూ.3278 కోట్ల భారీ అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తి అయితే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఇతర ప్రాజెక్టుల డిపిఆర్ లు కూడా సమర్పించాలని కృష్ణా వాటర్ బోర్డు అనుమతులు మంజూరు చేసిన తర్వాతనే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని బోర్డు ఆదేశించినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదని ఆయన తెలిపారు.
ఇది కేంద్ర మంత్రిగా మీరు ఇచ్చిన ఆదేశాలను కూడా ఉల్లంఘించడమేనని చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి అయితే దక్షిణ తెలంగాణ కు చెందిన కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి, డిండి, ఎస్ ఎల్ బి సి, ఏఎంఆర్ పి ప్రాజెక్టులు ఎండిపోతాయని ఆయన అన్నారు. ఇదే జరిగితే తెలంగాణకు తీరని అన్యాయం చేసినట్లు అవుతుందని చల్లా వంశీచంద్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు.
హైదరాబాద్ మహానగరానికి తాగు నీటికి కూడా తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందని ఆయన అన్నారు. అందువల్ల తక్షణమే జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అడ్డుకోవాలని, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును తక్షణమే నిలుపుదల చేయాలని ఆయన కేంద్ర మంత్రికి పంపిన లేఖలో కోరారు.