రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం నిర్మల్ మండలం లోని ఎల్లాపల్లి గ్రామంలో తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీల కు బియ్యం, నగదు పంచిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినందున వలస కూలీల కు ఇబ్బందులు కలగకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్లు ఆదేశించామని అన్నారు. జిల్లాలో 6300 మంది వలస కూలీల గుర్తించామని తెలిపారు.
ఎల్లపల్లి గ్రామంలో తమిళనాడు రాష్ట్రం నాగపట్నం కు చెందిన 6గురు, జార్ఖండ్ కు చెందిన 16 మంది దేవాలయ నిర్మాణ వలస కూలీలకు కుటుంబానికి 12 కిలోల బియ్యం రూ 500/-నగదును పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ ఉన్నందున ఎవ్వరు బయటకు రాకూడదు అన్నారు.
స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అని ప్రతి ఒక్కరూ మూడు అడుగుల సామాజిక దూరం పాటించాలన్నారు. 60 సంవత్సరాలు పైబడిన వారు బయటకు వెళ్లొద్దని వారికి కరోనా వైరస్ తొందరగా సోకే అవకాశముందన్నారు.
నిర్మల్ జిల్లాలో విదేశాలనుండి 1055 మంది వచ్చారని వారిలో ఒక్కరు కూడా కరోనా వైరస్ వ్యాధి నిర్ధారణ కాలేదు అన్నారు. ఏప్రిల్ 1 నుండి రేషన్ కార్డు ఉన్నవారికి 12 కిలోల బియ్యం రూ 1500 అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ, అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, సింగిల్విండో చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, అల్లోల మురళీధర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ అల్లోల రవీందర్ రెడ్డి, తాహసిల్దార్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.