కరోనా లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతలుగా జీతాలు ఇవ్వాలని నిర్ణయించారని, విపత్కర పరిస్థితులు నెలకొన్నందున సీఎం సూచనకు తాము అంగీకరించామని రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అంటున్నారు.
అయితే దీనిపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. కరోనా పరిస్థితుల ప్రభావంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, ఈ నెలలో సగం జీతం ఇస్తామని చెప్పారని, మిగిలిన జీతం నిధులు సర్దుబాటు అనంతరం ఇస్తామని తెలిపారని సూర్యనారాయణ పేర్కొన్నారు.
అయితే దీన్ని ఆంధ్రప్రదేశ్ గజిటెడ్ అధికారుల సంఘం జేఏసీ నాయకుడు కె.వి. కృష్ణయ్య తీవ్రంగా ఆక్షేపించారు. ఇది ఆర్థిక అత్యయిక పరిస్థితి కాదు. IAS IPS లాంటి అఖిల భారత సర్వీసుల జీతాలకు కోత విధించడం చాలా తీవ్రమైన విషయం. వారికి జీతభత్యాలకు సంబంధించిన విషయాలు స్టేట్ సబ్జెక్ట్ కాదు.
కేంద్ర విషయాలకు సంబంధించి రాష్ట్రం ఇలాంటి చర్యలు తీసుకోవడం చాలా తీవ్రమైన విషయం. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలు సగటు ఉద్యోగుల జీవించే అవకాశాలను కూడా తీవ్రంగా దెబ్బ తీయడమే కాకుండా ఆర్టికల్ 21 కు ఈ నిర్ణయం విరుద్ధం అని ఆయన అన్నారు.
జీతాలకు సంబంధించిన ఒప్పందాలన్నీ కూడా ఒక ఎంప్లాయర్ గా ఏకపక్షంగా ఎప్పుడంటే అప్పుడు తగ్గించేందుకు వీలు లేదని ఆయన అన్నారు. ఉద్యోగులకు జీతాల్లో కోత విధించడం న్యాయస్థానాల్లో నిలవక పోవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు.
దేశంలో ఆర్థిక అత్యయిక పరిస్థితి ఏర్పడిన సందర్భంలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. అప్పుడు రాష్ట్ర అంశాలన్నిటి మీద కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణమైన అధికారాలు ఉంటాయతప్ప ఇలా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం నిర్ణయాలు తీసుకోలేవని ఆయన అన్నారు.
కేవలం ఈ(21) ఇరవై ఒక్క రోజుల ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితి కుదేలయ్యే అవకాశమే లేదని ఆయన అన్నారు. ప్రపంచ ఆర్థిక మాంద్యం (1929-30) సమయంలో కూడా భారతదేశ సంప్రదాయ ఆర్థిక వ్యవస్థను పెద్దగా ప్రభావితం చేయలేదు. కేవలం జూట్ మరియు బొగ్గు పరిశ్రమల మీద మాత్రమే ప్రభావం పడింది.
కాబట్టి 21 రోజుల బ్రేక్డౌన్ కే మన ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితి లేదు. యూరప్ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒక మూస నమూనా లో ఉండి త్వరగా ప్రభావితం అయ్యేందుకు ఆస్కారం వుంటుంది. మన ఆర్థిక వ్యవస్థ ఐరావతం లాంటిది. అంత సులువుగా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశమే లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. లేదు ఇలాగే ముందుకు వెళితే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థల జుట్టు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంచడమే అవుతుందని ఆయన అన్నారు.