శ్రీమల్లికార్జునస్వామివారి స్పర్శదర్శనం పునప్రారంభించారు. ఉగాది మహోత్సవాలకు మల్లికార్జునభ్రమరాంబాలను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు కనుక ఉగాది సందర్భంగా గత నెల(మార్చి నెల) 28 నుండి స్పర్శ దర్శనం, గర్భాలయం అభిషేకాలను ఆలయాధికారులు నిలిపివేశారు. అయితే తాజాగా తెలుగు నూతన సంవత్సర ఉగాది ఉత్సవాలు ముగిశాయి. దీంతో భక్తులకు మల్లన్న స్పర్శదర్శనం తిరిగి ప్రారంభించారు ఆలయాధికారులు.
ఇక శ్రీ మల్లికార్జున స్వామివారి స్పర్శదర్శనం ఉచితంగా మంగళవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు రెండు సార్లు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. వారంలో నాలుగు రోజులు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు అనుమతించగా.. గురువారం మాత్రం ఆలయ శుద్ధి చేసుకునేందుకు వీలుగా 01.30 గంటల నుంచి 02.30 వరకు గర్భాలయ ప్రవేశం ప్రవేశం కల్పించి తిరిగి సాయంకాలం 06.30 నుంచి 07.30 వరకు సామాన్యుల భక్తులకు అనుమతి ఇస్తున్నారు.
అయితే సమయంలో కేవలం ఆలయ ముఖమండపం నుంచి ప్రవేశం చేసిన వారికి మాత్రమే స్పర్శదర్శనం చేసుకునే అవకాశం ఇస్తారు. అంతేకాదు గర్భాలయంలోకి ప్రవేశించే భక్తులు తప్పకుండా సాంప్రదాయ దుస్తులను ధరించాలనే నియాన్ని కూడా ఆలయాధికారులు కఠినంగా అమలు చేస్తున్న సంగతి విదితమే.