గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. లంక భూములను ముంచెత్తుతుంది. విలువైన పంటలన్నీ పాడైపోతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద భారీగా ధవళేశ్వరం బ్యారేజికి చేరుకుంటుంది. బ్యారేజి నుంచి విడుదలైన నీరు ముందుగా తూర్పుగోదావరి జిల్లా కడియం,కోనసీమ జిల్లా ఆలమూరు మండలాలను ముంచేస్తుంది.
ఈ లంక భూముల్లో అనేక పూల తోటలు,వాణిజ్య పంటలతో పాటు విలువైన నర్సరీ మొక్కలు కూడా పెంచుతున్నారు. అవన్నీ ప్రస్తుతం ముంపులోనే ఉన్నాయి. పండిన పంటలను బయటకు తీసుకురావడం కూడా సాధ్యం కావడం లేదని రైతులు వాపోతున్నారు.
ఆలమూరు మండలంలోని మడికి, బడుగువానిలంక, చెముడులంక,చొప్పెల్ల లంక, మూలస్థాన అగ్రహారం,జొన్నాడ లంక భూములకు మంగళవారం భారీగా వరదనీరు చేరింది.ఈ భూములలో అరటి, బొప్పాయి, జామ, కంద,తమలపాకులు వంటి వాణిజ్య పంటలతో పాటు దొండ,బెండ, వంగ, మిరప, కాకర, పొట్ల, దోస వంటి కూరగాయ పంటలు, బంతి, గులాబీ, లిల్లీ,కనకాంబరం, మల్లి,జాజులు వంటి పూల తోటలు అలాగే వివిధ రకాల ఖరీదైన నర్సరీ మొక్కలు ఉండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
మిగిలిన ప్రాంతాల్లో కంటే ఈ ప్రాంతంలోనే ఖరీదైన పంటలు సాగు చేస్తుంటారు. అధిక పెట్టుబడులతో సాగయ్యే ఈ పంటలు గోదారమ్మకు ఉగ్రరూపానికి పాడైపోవడం వల్ల రైతులు ఆవేదనకు అంతులేకుండా పోతుంది. ఇక్కడతో ఆగక మరింత వరదనీరు ఎగువ ప్రాంతాలనుండి వస్తుందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తుండటంతో పల్లపు ప్రాంతాల భూమిలేగాక మెరక ప్రాంతంలో పంటలు ముంపు బారిన పడతాయని రైతులు భయాందోళనలు చెందుతున్నారు.