తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తీరాల్సిందేని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ వెల్లడించారు. సభా నాయకుడిగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఇదే విషయం చెప్పారని, దానికే నేను కూడా కట్టుబడి వున్నాను అని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఏ సభుడైనా పార్టీ మారాలనికుంటే తప్పనిసరిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనని ఆయన అన్నారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. డిసెంబర్ 2 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. 15 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయని ఆయన తెలిపారు.