విజయవాడ పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో తూర్పు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ విజయం దక్కించుకోలేక పోయింది. వైసీపీ తరఫున పోటీ చేసిన బొప్పన భవకుమార్ కేవలం 67826 ఓట్లు సాధించుకున్నారు. ఇక్కడ నుంచి గెలిచిన టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ 82990 ఓట్లు సాధించి దాదాపు 15 వేల ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు పరిస్థితిని గమనిస్తే.. ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు యువ నాయకుడు దేవినేని అవినాష్ ఉత్సాహంగా పని చేస్తున్నారు.
అయితే అధిష్టానం ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేయలేదు. ఇచ్చే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ప్రస్తుతం ప్రజల్లో బాగానే తిరుగుతున్న అవినాష్కు టికెట్ ఇస్తే దాదాపు గెలిచే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా చివరి నిముషంలో ఒత్తిళ్లకు తలొగ్గి వేరేవారికి ఇస్తే మాత్రం మరోసారి ఇక్క డ టీడీపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది. సెంట్రల్ నియోజకవర్గం విషయానికి వస్తే గత ఎన్నికల్లో మల్లాది విష్ణు వైసీపీ తరఫున పోటీ చేసి విజయందక్కించుకున్నారు. అయితే అత్యంత స్వల్ప మెజారిటీతో అంటే కేవలం 25 ఓట్ల మెజారిటీతోనే ఈయన గెలుపు గుర్రం ఎక్కారు.
వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఇస్తేఈ దఫా ఓడిపోవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఉండకపోవడం సమస్యలను పట్టించుకోకపోవడం ఎమ్మెల్యేకు అంతర్గత వ్యతిరేకత పెరిగేలా చేస్తోంది. ముఖ్యంగా స్లమ్ ఏరియాలను అభివృద్ధి చేస్తానని చెప్పిన ఆయన ఇప్పటి వరకు ఆదిశగా అడుగులు వేసింది లేదు.
దీంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. విజయ వాడ పశ్చిమ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెలంపల్లి శ్రీనివాస్ విజయం దక్కించుకున్నారు. అయితే ఈయన కూడా కేవలం 7671 ఓట్ల మెజారిటీతోనే గెలిచారు.
గత మంత్రి వర్గంలో చోటు సంపాయించుకున్నా ఆయన నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికీ కొండ ప్రాంత వాసులకు పట్టాలు ఇప్పించుకోలేక పోయారు. అదే సమయంలో వ్యాపారుల సమస్యలు కూడా పరిష్కరించలేదనే వాదన ఉంది. వైశ్య సామాజిక వర్గం సమస్యలను పరిష్కరించలేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి గెలుపు గుర్రం ఎక్కుతారా? అనేది కష్టమేనని అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ జనసేన, టీడీపీ తరఫున ఉమ్మడి అభ్యర్థిని కనుక నిలబెడితే వెల్లంపల్లి గెలుపు కష్టమేఅని అంటున్నారు.