ఐ.పోలవరం మండలం ఎదుర్లంక బాలయోగి వారధిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మోటార్ సైకిల్ పై వెళుతుండగా టిప్పర్ లారీ ఢీ కొనడంతో సంఘటనా స్దలంలో ముగ్గురు మృతిచెందారు. ఒక చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
కాట్రేనికోన మండలం చెయ్యారు గ్రామానికి చెందిన గుబ్బల శ్రీను(45) మంగాయమ్మ(42) దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈరోజు తన కుమార్తె ఇంటికి ద్రాక్షారామం వెళ్లి తన కుమార్తె పిల్లలు జశ్వంత్ శివ కార్తీక్(6), తేజ శ్రీలక్ష్మి(5) లను తీసుకుని తన స్వగ్రామం చెయ్యేరు తిరిగి వస్తూండగా ఈ దుర్ఘటన జరిగింది.
ఈ ఘటనలో తాత, అమ్మమ్మ మనుమడు మృతి చెందగా మనుమరాలు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. సంఘటనా స్థలానికి అమలాపురం డి.ఎస్.పి మాధవరెడ్డి,ఐ.పోలవరం ఎస్.ఐ రాజేష్ లు చేరుకొని వివరాలు సేకరించారు.
సంఘటనా స్దలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నతీరు చూపరులను కంటతడిపెట్టించింది. బాలయోగి వారధిపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఈ వారధిపై ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.