గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని గ్రామీణ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన ఇన్సెంటివ్ నిధులు రూ. 9 కోట్ల 56లక్షల 45 వేలు మంజూరయ్యాయి. ఇందులో రూ.8.43కోట్లు రోడ్ల అభివృద్ధికి , రూ. 1.13 కోట్లు ఐదేళ్లు రోడ్ల పర్యవేక్షణకు ఉపయోగించనున్నారు.
నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు చొరవతో పల్నాడు ప్రాంతానికి అత్యధికంగా ఈ నిధులు కేటాయింపులు జరిగాయి. ఈ నిధులతో పల్నాడు ప్రాంతంలోని మార్గాలకు మహర్దశ కలుగుతుంది. అధ్వాన్నంగా ఉన్న రోడ్ల ను ఈ పథకం కింద చేర్చి అధిక నిధులు మంజూరయ్యేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ రోడ్ల అభివృద్ధి త్వరితగతిన జరగాలని అధికారులను కోరారు.
నరసరావుపేట పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. మార్గాలు బాగుంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని,ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి సాధించుకోవచ్చని అన్నారు. మరిన్ని రోడ్లను ఈ పథకం కింద చేరుస్తామని, నిధులు మంజూ రయ్యేలా పాటుపడుతామని స్పష్టం చేశారు.