రోడ్డు భద్రత అనేది నిత్య జీవితంలో ఒక భాగం కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. 32వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా హైదరాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయంలో రహదారి భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అజయ్ మాట్లాడుతూ రోడ్డు భద్రత అనేది ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి రోజు అవసరం, నిర్లక్ష్యం తగదని అన్నారు. రోడ్డు భద్రత బ్యానర్, స్టిక్కర్స్, రోడ్డు నిబంధనలు పొందుపర్చిన కరపత్రాలను రవాణా శాఖ మంత్రి విడుదల చేశారు. ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చైతన్య పర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం రహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తుస్తోందని ఆయన అన్నారు.
రోడ్డుపై ప్రయాణం చేసే వారు విధిగా తప్పనిసరిగా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని మంత్రి కోరారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. వేగాన్ని నియంత్రించుకుంటూ ప్రయాణాలు చేసినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని ఆయన అన్నారు.