రోదసీ వీక్ ప్రారంభోత్సవంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మన దేశం బహుముఖ ప్రగతి సాధిస్తోందని, ఇతర దేశాలతో పోటీ పడేవిధంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తోందని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ పేర్కొన్నారు. ప్రపంచ రోదసీ వీక్ లో భాగంగా శ్రీహరికోటలోని షార్, విజయనగరంలోని సీతం కళాశాల సంయుక్తంగా ఏర్పాటు చేసిన వైజ్ఞానికి ప్రదర్శనను గురువారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్బంగా సీతం కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో మాట్లాడారు. శాస్త్ర, సాంకేతిర రంగాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల ఫలితంగా సామాన్య ప్రజలకు ఎన్నో రకాల సేవలను సులభంగా అందించగలుగుతున్నామని పేర్కొన్నారు. తుఫాన్లు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తులు సంభవించే సమయంలో ముందుగా సమాచారం తెలుసుకొని తగిన నష్ట నివారణ చర్యలు చేపట్టగలుగుతున్నామని గుర్తు చేశారు.
భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రగతి సాధించింది అనడానికి మంగళయాన్ ప్రాజెక్టే నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. నాసాకు ధీటుగా ఇస్రో తన కార్యకలాపాలను నిర్వహిస్తోందని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రయోజనాత్మక ప్రయోగాలను చేపడుతోందని అన్నారు. రాష్ట్రంలోని శ్రీ హరికోటలో ఉన్న షార్ కేంద్రం ఎన్నో ప్రయోగాలకు వేదికగా నిలిచి దేశంలోనే ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని మన ఉనికిని చాటుతోందని మంత్రి పేర్కొన్నారు.
ఈ రోజు సీతం కళాశాల వేదికగా ప్రారంభించిన వైజ్ఞానికి ప్రదర్శన 6 నుంచి 8వ తేదీ వరకు ఉంటుందని విద్యార్థులందరూ విచ్చేసి ప్రదర్శనలను తిలకించాలని, స్వీయ అనుభవాన్ని పెంపొందించుకోవాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులు వచ్చే విధంగా డీఈవో, ఎస్.ఎస్.ఎ. పీవో బాధ్యతలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆదేశించారు.
ఆకట్టుకుంటున్న వైజ్ఞానికి ప్రదర్శన
జి.ఎస్.ఎల్.వి., పి.ఎస్.ఎల్.వి. శాటిలైట్ పరికరాల ఉపయోగం, స్పెక్ట్రమ్ విధానం, శాస్త, సాంకేతిక పరిశోధన విశేషాలు తదితర అంశాలను మేళవిస్తూ స్థానిక సీతం కళాశాలలో ఏర్పాటు చేసిన వైజ్ఞానికి ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన, షార్ కేంద్రం చేసిన ప్రయోగాలను ప్రదర్శనలో ఉంచారు.
ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహించేందుకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని ఈ సందర్బంగా షార్ అధికారులకు మంత్రి చెప్పారు. ఆసక్తి కలిగిన విద్యార్థులకు, అధ్యాపకులకు శ్రీహరికోటలోని షార్ కేంద్రాన్ని సందర్శించే అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా షార్ అధికారులకు మంత్రి సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, సీతం కళాశాల కార్యదర్శి బొత్స ఝాన్సీలక్ష్మి, షార్ ప్రతినిధులు ఎ. ప్రసాదరావు, జి. అప్పన్న, సీతం కళాశాల డైరెక్టర్ మజ్జి శశిభూషణ్ రావు, ప్రిన్సిపాల్ డి.వి. రమణమూర్తి, డీఈవో వెంకటేశ్వరరావు, ఎస్.ఎస్.ఎ. పీవో స్వామినాయుడు, డిప్యూటీ డీఈవోలు, కళాశాల అధ్యాపకలు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.