మాట మార్చకుండా… మడం తిప్పకుండా చెప్పిన మాటకు కట్టుబడి శాసన మండలి రద్దు చేయాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె రఘురామకృష్ణంరాజు ఎవరూ ఊహించని విధంగా మరో పని చేశారు.
తమ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాధనం వృధా చేయడానికి వ్యతిరేకమని, శాసన మండలి నిర్వహణ కేవలం ఖర్చు తప్ప ఎలాంటి ఉపయోగం లేదనేది ఆయన కచ్చితమైన అభిప్రాయమని అందువల్ల తక్షణమే మండలి రద్దుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రఘురామకృష్ణంరాజు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు నేడు లేఖ రాశారు.
శాసన మండలిని రద్దు చేయాలని కోరుతూ 2020 జనవరి 27న రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానం విషయాన్ని ఆయన కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. రాజ్యాంగంలోని 169(1) అధికరణ ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి పార్లమెంటులో ఉంచాలని, పార్లమెంటు దానిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి శాసన మండలి రద్దు నిర్ణయాన్ని మార్చుకునేది లేదని స్పష్టం చేసినందున తక్షణమే పార్లమెంటు ముందు ఆ బిల్లును ఉంచాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. పార్లమెంటు తక్షణమే దాన్ని ఆమోదించాలని వెనువెంటనే శాసన మండలి రద్దు చేయాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు.
ఏపి ముఖ్యమంత్రి ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి ఎట్టిపరిస్థితుల్లో ఇష్టపడరని, అందువల్ల వృధా ఖర్చు అయిన మండలిని రద్దు చేయాలని ఆయన కోరారు.