దావోస్ లో భేటీ… తిరిగి రాగానే అప్పనంగా టెండర్: త్రిబుల్ ఆర్ ఆరోపణ
దేశంలో ఎక్కడా లేని విధంగా బైజూస్ కంపెనీ ద్వారా ఒప్పందం కుదుర్చుకొని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఆన్లైన్ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టాలనుకోవడం తీవ్ర అభ్యంతరకరమని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు.. బైజూస్ కంపెనీకి 500 కోట్ల రూపాయల ఎడ్యు టెక్ టెండర్ ను కట్టబెట్టాలని అనుకున్నప్పుడు, ఇతర కంపెనీల నుంచి టెండర్లను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు.
వంద కోట్ల రూపాయల ప్రాజెక్టుకు టెండర్లను ఆహ్వానిస్తే, రివర్స్ టెండరింగ్ కు వెళ్తామనీ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమయిందని అని ప్రశ్నించారు.. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ… ఎడ్యు టెక్ టెండర్ల కోసం ఇతర కంపెనీలను కూడా ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ బైజూస్ కి ఇవ్వాలనుకుంటే, వారు ఎంత మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను బోధిస్తారని, మిగతా వారికి ఏవిధంగా చార్జీలను వసూలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
బైజుస్ తో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత, నూతన ఉపాధ్యాయుల నియామకం ఉంటుందా?, ఉండదా?? అన్న విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. అలా కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాకు నచ్చినట్టు నేనుంటా… అంటే కుదరదని, అది సినిమాలలో హీరోలకు మాత్రమే చెల్లుతుందన్నారు.. బైజుస్ తో ఒప్పందంపై ప్రమోటరే ఆశ్చర్య పడే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.
ఇటీవల దావోస్ కు వెళ్ళిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పెట్టుబడులను తీసుకువస్తార నీ అనుకుంటే, రాష్ట్ర సంపదను ఇతరులకు కట్టబెడుతున్నారని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. దావోస్ లో బైజుస్ రవీంద్రన్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇ 500 కోట్ల రూపాయల టెండర్ ను ఆయనకు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారన్నారు.
క్యాబినెట్ లో చర్చించకుండానే, బైజూస్ ప్రతిపాదించిన ప్రాజెక్టుకు ఓకే చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. విద్యాశాఖ లోని నిజాయితీపరుడైన అధికారి రాజశేఖర్ తో కూడా ఈ ప్రాజెక్టు అమలుపై చర్చించి నట్లు లేదని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఏకపక్షంగా ఈ ప్రాజెక్టును ఆమోదించి స్టాక్ మార్కెట్ లో బైజుస్ షేర్ వాల్యూ పెరగడానికి పరోక్షంగా దోహద పడుతున్నట్లు కనిపిస్తోందని తెలిపారు..
బైజుస్ లో ఎంతోమంది పెట్టుబడులు పెట్టారని, వారి పెట్టుబడులను తిరిగి చెల్లించడానికి ఆ కంపెనీ పబ్లిక్ ఇష్యూ కు వెళ్లనుందన్నారు. అయితే పబ్లిక్ ఇష్యూకు వెళ్లేముందు, ఆయా కంపెనీల చేతులలో ఇటువంటి ప్రాజెక్టు ఉండడం ఎంతో అవసరమని, దానిద్వారా షేర్ వాల్యూ పెరుగుతుందని తెలిపారు..
బైజూస్ కంపెనీ గురించి గతంలో పార్లమెంటులో కూడా చర్చ జరిగిందని, బైజుస్ కంపెనీ ద్వారా ఆన్లైన్ ట్యూషన్లు చెప్పించుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల నుంచి నేరుగా బైజుస్ ఖాతాలోకి నగదు బదిలీ అవుతున్నట్లు ఆరోపణలు వినిపించాయన్నారు. ప్రపంచ ఫుట్ బాల్ టోర్నీ (ఫిఫా), క్రికెట్ టోర్నీ లకు బైజుస్ స్పాన్సర ర్ వ్యవహరిస్తోందని, బైజుస్ అనేది ఒక కమర్షియల్ సంస్థ అని, ముఖ్యమంత్రికి నచ్చింది కదా అని టెండర్ ఇవ్వడానికి లేదన్నారు.